యాప్నగరం

బందరు పోర్టు ఒప్పందం రద్దుపై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్

బందరు పోర్టు నిర్మాణ పనుల నుంచి నవయుగ సంస్థను తప్పిస్తూ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆగస్టు 8న జీవో జారీచేయగా, క్యాబినెట్ సమావేశంలోనూ తీర్మానించారు.

Samayam Telugu 13 Sep 2019, 8:29 am
మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనుల నుంచి తమను తప్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నవయుగ ఇంజినీరింగ్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఆగస్టు 8 ప్రభుత్వం జారీచేసిన జీవో నెంబరు 66ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై గురువారం హైకోర్టులో వాదనలు కొనసాగాయి. బందరు పోర్టు ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసిందని నవయుగ సంస్థ హైకోర్టులో వాదనలు వినిపించింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో 66 అమలును నిలిపేయాలని కోరిన ఆ సంస్థ తరఫు లాయర్ పి.విల్సన్‌.. పనులను ఇతరులకు అప్పగించకుండా చూడాలని అభ్యర్థించారు. ఎలాంటి నోటీసుగానీ, వివరణ కోరకుండానే ఏకపక్షంగా ఒప్పందాన్ని రద్దు చేశారని తెలిపారు. అడ్డంకులను తొలగించి ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన 5,324 ఎకరాల భూమిని అప్పగించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. జిల్లా కలెక్టర్‌కు రాసిన లేఖలో 932 ఎకరాలు ఆక్రమణలో ఉన్నాయని చెప్పారని, తమకు అప్పగించిన 412 ఎకరాలకు సైతం కనీస సౌకర్యాలు కల్పించలేదని వివరించారు.
Samayam Telugu ap-main23a


సొంత తప్పిదాన్ని ప్రభుత్వం మాపై నెడుతోందని, నవయుగ సంస్థ నిబంధనల ఉల్లంఘంచలేదని పేర్కొన్నారు. ఒకవేళ అలా జరిగినా సరిదిద్దుకోవడానికి నోటీసిలివ్వాలి కానీ అదీ చేయలేదన్నారు. నిబంధనల ప్రకారం ఒప్పందం రద్దుచేస్తూ జీవో జారీచేయడానికి ముందు మూడు దశలను అనుసరించాల్సి ఉండగా.. తొలి దశలోనే రద్దు చేశారన్నారు. సహజన్యాయ సూత్రాలకు విరుద్ధంగా, ఆకస్మికంగా ఒప్పందాన్ని రద్దు చేసినప్పుడు హైకోర్టును ఆశ్రయించే వెసులుబాటు తమకు ఉందని అన్నారు.

ప్రాజెక్టు విలువ రూ.18 వేల కోట్లని, నోటీసివ్వడం ఉపయోగం లేని ప్రక్రియ అని ఏజీ చెప్పడం సరికాదని నవయుగ తరఫు లాయర్ వాదించారు. పోర్టు ప్రాథమిక పనుల కోసం ఇప్పటికే రూ.436 కోట్లు ఖర్చు చేశామని, ఈ ఏడాది ఫిబ్రవరిలోనే నాటి ముఖ్యమంత్రి పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారన్నారు. ప్రభుత్వం మారగానే ఆగస్టులో ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది? అలా ఆకస్మికంగా ప్రాజెక్ట్‌ను రద్దు చేయడానికి వీల్లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం కొత్త టెండర్‌కు వెళ్లి వేరేవారికి పనులు అప్పగిస్తే మాకు పూడ్చుకోలేని నష్టం వాటిల్లుతుంది కాబట్టి జీవో అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.