యాప్నగరం

వాళ్లకు పదవీ విరమణ వయస్సు 62 ఏళ్ల పెంచడం సాధ్యం కాదు.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు

న్యాయాధికారుల పదవీ విరమణకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రిటైర్మెంట్ వయస్సు పెంచేది లేదని తేల్చి చెప్పింది.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 18 Sep 2022, 11:01 pm
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా న్యాయాధికారులకు పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచడం సాధ్యం కాదని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. హైకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలని, న్యాయాధికారుల పదవీ విరమణ వయస్సు దీనితో సమానంగా ఉండటానికి రాజ్యాంగ నిబంధనలు అంగీకరించవని తీర్పు వెలువరించింది. ఈ తేడా సహేతుకమైనదేనని, దీన్ని అలాగే కొనసాగించాలని ఆలిండియా జడ్జిల అసోసియేషన్‌ కేసులో సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పిందని హైకోర్టు గుర్తు చేసింది.
Samayam Telugu ఏపీ హైకోర్టు (ఫైల్ ఫొటో)


న్యాయాధికారుల రిటైర్మెంట్‌ వయస్సు పెంపుపై ఫుల్‌ కోర్టు (పాలనాపరమైన నిర్ణయాల కోసం హైకోర్టు న్యాయమూర్తులందరూ సమావేశమవడం) నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఆ నిర్ణయాధికారం ఫుల్‌ కోర్టుకు లేదని, అలా చేయడం సుప్రీం కోర్టు తీర్పును అతిక్రమించడమే అవుతుందని స్పష్టం చేసింది. ఏపీ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ చట్టంలోని సెక్షన్‌ 3 (1ఏ) ప్రకారం న్యాయాధికారుల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లుగానే ఉందని, దాన్ని సవరించనప్పుడు 62 ఏళ్లకు పెంచడం సాధ్యం కాదని వివరించింది. ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించడమే అవుతుందని తెలిపింది.

న్యాయాధికారుల పదవీ విరమణ వయస్సు పెంపుపై రిటైర్డ్ న్యాయాధికారి కె.సుధామణి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు ధర్మాసనం తీర్పు వెలువరించింది. విజయనగరం జిల్లా మొదటి అదనపు జిల్లా జడ్జిగా పనిచేస్తున్న కె.సుధామణి వయసు 60 ఏళ్లకు చేరుకోవడంతో ఆమెకు పదవీ విరమణ వర్తింపజేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ సుధామణి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. న్యాయాధికారుల రిటైర్మెంట్‌ వయస్సును 62 ఏళ్లకు పెంచాలని కోరారు. ఈ వ్యాజ్యంపై సీజే నేతృత్వంలో విచారణ జరిపిన ధర్మాసనం.. ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.