యాప్నగరం

చంద్రబాబు వెంటనే కరకట్ట ఇంటిని ఖాళీ చేయాలి: మంత్రి అనిల్

Chandrababu Naidu: టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు వెంటనే తాడేపల్లిలోని కరకట్ట ఇంటిని ఖాళీ చేయాలని మంత్రి అనిల్ సూచించారు.

Samayam Telugu 16 Oct 2020, 6:34 pm
కృష్ణా నదికి ప్రమాదకర స్థాయిలో వరద వస్తున్న నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కరకట్టపై నిర్మించిన తన నివాసాన్ని వదిలి వెళ్లిపోవాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సూచించారు. ఈ మేరకు కర్నూలులో మంత్రి అనిల్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కరకట్ట మీద అక్రమంగా ఇల్లు కట్టుకుని, ప్రభుత్వం ఏలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించడం సరి కాదన్నారు. వరదలు, వర్షాలపై అప్రమత్తంగా పని చేస్తున్నామని స్పష్టం చేశారు. చంద్రబాబు ఇల్లు వరదలు వస్తే మునిగిపోతుందని.. ఎవరూ ముంచక్కర్లేదని మంత్రి అనిల్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే కరకట్టపై ఉన్న ఇళ్లను ఖాళీ చేయాలంటూ చంద్రబాబు సహా పలువురికి ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
Samayam Telugu చంద్రబాబు కరకట్ట ఇల్లు


ఇక, చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్.. ఏపీకి పర్యాటకుల మాదిరిగా రాష్ట్రానికి వస్తూ పోతున్నారని మంత్రి అనిల్ విమర్శించారు. చంద్రబాబు హయాంలో ఎప్పుడూ వర్షాలు కురవలేదని, ఆయన పాలనలో కరువు తాండవించిందని, గత ప్రభుత్వ హయాంలో మాత్రం తుఫాన్లు వచ్చి ప్రజలు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు.

చంద్రబాబు పాలనలో శ్రీశైలం పవర్ ప్రాజెక్టును వరద నీటితో ముంచేశారని మంత్రి అనిల్ అన్నారు. చంద్రబాబు తప్పిదాల కారణంగా హైదరాబాద్‌లో కూడా వరదలు వచ్చాయన్నారు. వరదల నివారణకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, తమది రైతు పక్షపాతి ప్రభుత్వం కాబట్టే దేవుడు కూడా సహకరిస్తున్నారని చెప్పారు.

తుంగభద్ర పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించామని మంత్రి అనిల్ చెప్పారు. తుంగభద్ర పుష్కరాలకు రూ. 210 కోట్ల నిధులు విడుదల చేశామన్నారు. కోవిడ్ నిబంధనల ప్రకారం తుంగభద్ర పుష్కరాలను నిర్వహించినట్లు తెలిపారు. రాయలసీమ ప్రాజెక్టులకు రూ. 40 వేల కోట్లతో ప్రణాళికలను సిద్ధం చేశామని పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.