యాప్నగరం

ఏపీలో మళ్లీ కాపు ఉద్యమం.. ముద్రగడ యాక్టివ్ కాబోతున్నారా.. జేఏసీ కీలక భేటీ!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో కాపు జేఏసీ నాయకులు సోమవారం భేటీ కాబోతున్నారు.

Samayam Telugu 20 Sep 2020, 8:55 pm
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మళ్లీ యాక్టివ్ కాబోతున్నారా? ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కాపు ఉద్యమం జోరందుకోనుందా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. కొద్దిరోజుల క్రితమే కాపు ఉద్యమ నాయకత్వం తప్పుకుంటున్నట్లు ముద్రగడ పద్మనాభం కీలక ప్రకటన చేసిన విషయం విదితమే. అప్పటి నుంచి ఆయన సమావేశాలు పెట్టడం గానీ.. రిజర్వేషన్ల గురించి మాట్లాడటం కానీ చేయలేదు.
Samayam Telugu ముద్రగడ పద్మనాభం (ఫైల్ ఫొటో)
Mudragada Padmanabham


ఈ తరుణంలో ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో ఏపీలోని 13 జిల్లాల కాపు జేఏసీ నేతలు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలపై నిశితంగా చర్చించిన నాయకులు.. సోమవారం ముద్రగడ పద్మనాభంతో భేటీ కావాలని నిర్ణయించారు.

ముద్రగడే నాయకుడు!
ఈ సందర్భంగా కాపు నేతలు మీడియాతో మాట్లాడుతూ.. ముద్రగడ పద్మానాభంను కలిసి రాష్ట్ర కాపు జేఏసీకి నాయకత్వం వహించాలని కోరతామని వెల్లడించారు. కాపు జేఏసీ ముద్రగడ నాయకత్వంలోనే ముందుకు వెళ్తుందని తెలిపారు. మా నాయకుడు ముద్రగడేనని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో ఎన్ని కాపు సంఘాలు ఉన్నా వాటి ముఖ్య ఉద్దేశం రిజర్వేషన్ల సంకల్పమేనని పేర్కొన్నారు.

కాపు సంక్షేమం, అభివృద్ధి కోసం ఎవరు కృషి చేసినా జేఏసీ స్వాగతిస్తుందని నేతలు అన్నారు. రాష్ట్రం గర్వపడే ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అని, ఆయన నాయకత్వంలోనే కాపులకు రిజర్వేషన్లు సాధ్యమవుతాయని తామంతా తీర్మానించినట్లు చెప్పారు. సోమవారం కిర్లంపూడిలోని ముద్రగడ ఇంట్లో కాపు నేతలంతా సమావేశమవుతామని తెలిపారు. ఉద్యమం నుంచి తప్పుకోవద్దని, మళ్లీ నాయకత్వం వహించాలని ముద్రగడను తామంతా కోరుతామన్నారు. అయితే కాపు నేతలతో భేటీ అనంతరం ముద్రగడ ఏం ప్రకటించబోతున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.