యాప్నగరం

ఏపీ ఉద్యోగులకు శుభవార్త.. జీతాల పెంపుపై జగన్ సర్కారు కీలక ప్రకటన!

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనలకు సిద్ధమైన నేపథ్యంలో పీఆర్సీకి సంబంధించి మంత్రి బొత్స సత్యనారాయణ కీలక కామెంట్స్ చేశారు.

Samayam Telugu 29 Nov 2021, 6:21 pm
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపునకు సంబంధించిన పీఆర్సీపై జగన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఉద్యోగులకు జీతాల పెంపుపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. పీఆర్సీకి సంబంధించి జగన్ సర్కారుకు వ్యతిరేకంగా ఉద్యోగులు పోరుబాట పట్టబోతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో.. మంత్రి బొత్స సత్యనారాయణ కీలక విషయాలు వెల్లడించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


ఈ మేరకు సోమవారం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. పీఆర్సీకి సంబంధించి పలుమార్లు ఉద్యోగులతో చర్చలు జరిపామని, ఐఆర్ ప్రకటించామని తెలిపారు. ఉద్యోగుల సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

అలాగే పురపాలక సంఘాల్లో పనులు చేసిన కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపు ఆగలేదని, ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన ఇస్తామని మంత్రి బొత్స పేర్కొన్నారు. పీఆర్సీకి సంబంధించి అనవసర రాద్ధాంతం చేసేందుకే కొందరు ఆందోళన చేస్తున్నారని విమర్శించారు. ఇక, పంచాయతీ నిర్వహణ ఖర్చుల చెల్లింపునకే 15వ ఆర్థిక సంఘం నిధులు తీసుకున్నామని, ఆ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

కాగా, జగన్‌ ప్రభుత్వంతో అమీతుమీకి ఉద్యోగ సంఘాలు సిద్ధమైన విషయం తెలిసిందే. ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయ, పెన్షనర్ల అపరిష్కృత సమస్యలు, ఉద్యోగుల పీఆర్‌సీ, డీఏ బకాయిలు, ఇతర ఆర్థిక, ఆర్థికేతర ప్రయోజనాలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి ఇచ్చిన గడువు ఆదివారంతో ముగియడంతో ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ జేఏసీ.. తక్ష ణ కార్యాచరణ దిశగా విజయవాడలో వేర్వేరుగా అత్యవసర సమావేశాలు నిర్వహించాయి.

ఉద్యమానికి సంబంధించి తొలిదశ కార్యచరణపై నిర్ణయం తీసుకున్నాయి. డిసెంబరు 1వ తేదీ నుంచి జనవరి 6 వరకు చేపట్టాల్సిన కార్యక్రమాలను ఖరారు చేశాయి. ఈ క్రమంలో పీఆర్సీకి సంబంధించి మంత్రి బొత్స కీలక కామెంట్స్ చేయడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.