యాప్నగరం

అందుకే లూలూకి షాక్.. తేల్చి చెప్పిన జగన్ సర్కార్

గత ప్రభుత్వం పెట్టుబడులు వస్తున్నాయని ఆర్భాటపు ప్రచారం కోసమే భూములను కట్టబెట్టింది. ఒప్పందం చేసుకున్న తర్వాత కూడా లూలూ గ్రూప్ పనులు చేపట్టలేదు. అందుకే భూకేటాయింపులను రద్దు చేసినట్లు ఏపీ మంత్రి వెల్లడించారు.

Samayam Telugu 21 Nov 2019, 9:48 pm
లూలూ ప్రాజెక్ట్‌కి విశాఖపట్నంలో గత ప్రభుత్వం చేసిన భూ కేటాయింపులను జగన్ సర్కార్ రద్దు చేసిన విషయం తెలిసిందే. జగన్ సర్కార్ వైఖరి కారణంగానే లూలూ గ్రూప్ వెనక్కి తగ్గినట్టు విపక్షాలు చేస్తున్న విమర్శలపై ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. లూలూ ప్రాజెక్టుకు కేటాయించిన 13.83 ఎకరాల భూమి కేసుల్లో ఉందని చెప్పారు మంత్రి. న్యాయపరమైన చిక్కులున్న భూమిని అప్పగించడంపై అప్పటి ఏపీఐఐసీ ఎండీ లేఖ కూడా రాశారన్నారు.
Samayam Telugu Mekapati_Goutham_Reddy


ప్రాజెక్టు రద్దు చేయడానికి బిడ్డింగ్ లో పారదర్శకత లేకపోవడం.. లూలూకు కేటాయించిన భూమి విలువను తక్కువగా చూపడం ద్వారా ప్రజాధనం వృథా అవ్వడమే ప్రధాన కారణాలని మంత్రి స్పష్టం చేశారు. లూలూకు కేటాయించిన భూమికి మార్కెట్ విలువ ప్రకారం ఎకరా సుమారు రూ.40 కోట్ల నుంచి రూ.42 కోట్ల వరకూ ఉంటుందన్నారు. అంత విలువైన భూమిని కారుచౌకగా కట్టబెట్టారని.. అందువల్ల ఏడాదికి సుమారు 500 కోట్లకు పైగా ప్రజాధనం వృథా అవుతుందన్నారు.

Also Read: అక్కడ సెల్ఫీలపై నిషేధం.. పోలీసుల షాకింగ్ నిర్ణయం

గత ప్రభుత్వం రూ.2,200 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని ఆర్భాటపు ప్రచారం కోసమే భూములను కట్టబెట్టిందని మంత్రి విమర్శించారు. అంతేకాకుండా ఒప్పందం చేసుకున్న తర్వాత కూడా లూలూ గ్రూప్ పనులు చేపట్టలేదన్నారు. ఏపీఐఐసీలో ప్రస్తుతం అధునాతన టెక్నాలజీ ఉందని.. ప్రభుత్వమే అధునాతన భవనాలు నిర్మించగలమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో నిర్మించిన హైటెక్స్‌ను అలా కట్టిందేనని గుర్తు చేశారు.

సీఎం జగన్ ఆదేశాల మేరకు పారదర్శక పాలనకే పెద్దపీట వేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలోని ఇష్టారాజ్యంగా జరిగిన లోపాయికారీ ఒప్పందాలను నేరుగా ప్రజల ముందుంచేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి చెప్పారు. పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని అసత్య ప్రచారం జరుగుతోందని.. ఎంత రాసినా అబద్ధాలు నిజం కాబోవన్నారు.

Read Also: నోటును సగానికి చించి.. మాఫియా తరహాలో పంపిణీ.. మాజీ మంత్రి సంచలన ఆరోపణలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.