యాప్నగరం

మార్కెట్లోకి మేడిన్ ఆంధ్రా కారు.. బుగ్గన, రోజా సమక్షంలో కియా సెల్తోస్‌ లాంచ్

Kia Motors తొలి మేడిన్ ఆంధ్రా కారు సెల్తోస్‌ను గురువారం మార్కెట్లో ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు బుగ్గన, శంకర నారాయణ, ఏపీఐఐసీ చైర్‌పర్సన్ రోజా పాల్గొన్నారు.

Samayam Telugu 8 Aug 2019, 6:00 pm
మేడిన్ ఆంధ్రా కారు కియా సెల్తోస్‌ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. గురువారం కియా మోటార్స్‌ ఈ కారును లాంఛనంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. పెనుకొండలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కియా ప్రతినిధులతో పాటు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర నారాయణ, ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ రోజా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ కూడా పాల్గొనాల్సింది. కానీ ఆయన ఢిల్లీ పర్యటనను పొడిగించుకోవడంతో.. కియా కారు ప్రారంభోత్సవానికి హాజరు కాలేకపోయారు.
Samayam Telugu kia seltos1


సెల్తోస్ మోడల్ కారు ప్రారంభోత్సవానికి కియా ప్రతినిధులు ఆగష్టు 5న సీఎం జగన్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెనుకొండ ప్లాంటులో ఏటా 3 లక్షల కార్లను ఉత్పత్తి చేయగలమని సీఎంకి తెలిపారు. భవిష్యత్తులో 7 లక్షల కార్లను తయారుచేసే సామర్థ్యానికి చేరుకుంటామని చెప్పారు.
అనంతపురం జిల్లా పెనుకొండలో 535 ఎకరాల విస్తీర్ణంలో కియా ప్లాంట్‌ నిర్మాణాన్ని ప్రారంభించారు. దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ కంపెనీ సోదర సంస్థ అయిన కియా.. పెనుకొండ ప్లాంట్‌ కోసం రూ. 8 వేల కోట్లు ఖర్చు పెట్టింది. 2017 ఏప్రిల్లో ఒప్పందం జరగ్గా శరవేగంగా నిర్మాణం పూర్తయ్యింది. ఈ ఏడాది జనవరి 29న టెస్ట్ డ్రైవ్ నిర్వహించారు.
కియా కారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం కోసం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి గురువారం ఉదయం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి బెంగళూరు వెళ్లారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కియా ప్లాంట్ వద్దకు చేరుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.