యాప్నగరం

'ఏపీ ప్రజలు మళ్లీ నేనే కావాలని కోరుకుంటున్నారు'

నేను ఉచితంగా ఇసుక ఇస్తుంటే అవినీతి పేరుతో విమర్శలు చేశారు.. ఇప్పుడు జగన్ ప్రభుత్వం చేస్తుంది ఏంటి. రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నారు.

Samayam Telugu 21 Oct 2019, 9:57 pm
ఏపీ ప్రజలు మళ్లీ తానే రావాలని కోరుకుంటున్నారంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. నాలుగు నెలలకే జగన్‌ పాలనపై ప్రజలకు విసుగొచ్చిందని పరోక్షంగా చెప్పుకొచ్చారు. ఒకప్పుడు తాను ఇసుక ఉచితంగా ఇస్తానంటే విమర్శించారని.. ఇప్పుడు ఇసుక కొరతను తీర్చలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని బాబు విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని.. పనుల్లేక పస్తులుండే పరిస్థితి వచ్చిందన్నారు. శ్రీకాకుళం పర్యటనలో ఉన్న చంద్రబాబు జగన్ సర్కార్‌ టార్గెట్‌గా మండిపడ్డారు.
Samayam Telugu naidu


Read Also: 'నేను చేసిన తప్పదే'.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

రాష్ట్రంలో బంగారమైనా దొరుకుతుందేమో గానీ.. ఇసుక దొరికే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఇసుక విషయంలో అవినీతి జరిగిందన్న పేరుతో విమర్శలు చేసిన వైఎస్సార్‌సీపీ నేతలు.. ఇప్పుడు ఇసుకాసురులుగా మారిపోయారని ధ్వజమెత్తారు.
టీడీపీ హయాంలో విద్యుత్‌ కొరతను అధిగమించి మిగులు విద్యుత్‌ సాధించామని.. ఇప్పుడు ఎండాకాలం రాకముందే విద్యుత్‌ కోతలు మొదలయ్యాయని విమర్శించారు. దోమలపై యుద్ధం అంటే టీడీపీ హాయంలో తనపై విమర్శలు చేశారని.. ఇప్పుడు విద్యుత్‌ కోతలతో ప్రజలను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది అన్నారు. టీడీపీ వెళ్లినంత మాత్రాన టీడీపీకి నష్టంలేదన్నారు.

తాను ఎలాంటి తప్పు చేయలేదు.. భయపడను అన్నారు చంద్రబాబు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనపై 26 కేసులు వేసి ఏం సాధించారన్నారు. ప్రజాస్వామ్యం కోసం పోరాడి ప్రజల ఆశీస్సులు పొందాలని పార్టీ నేతలకు పిలుపు ఇచ్చారు. ఇక ప్రజావేదిక కూల్చివేసినప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వ పతనం ప్రారంభమైందన్నారు. అన్నా క్యాంటీన్లు మూసేసి పేదల పొట్టకొట్టారని.. ఇక ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయటానికి అది ఎవరి అబ్బ సొత్తూ కాదని.. అవసరమైతే వాళ్ల ముఖాలకు రంగులు పూసుకోవాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.