యాప్నగరం

ఏపీలో ఇవాళ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్.. తొలి దశ వివరాలివే, పోలింగ్ పక్కానా!

ఇవాళ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలకానుంది. ఈ నెల 25 అభ్యర్థులనుంచి నామినేషన్ల స్వీకరణ.. 27 నామినేషన్ల దాఖలుకు తుది గడువు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు ఎవరు అవరోధం కలిగించాలని చూసినా కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఈసీ హెచ్చరించారు.

Samayam Telugu 23 Jan 2021, 6:37 am
Samayam Telugu ఏపీలో పంచాయతీ ఎన్నికలు
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు ఎస్ఈసీ సిద్ధమైంది. నేడు నోటిఫికేషన్ విడుదలకానుంది. తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్‌ ఉదయం 10 గంటలకు జారీ చేయనున్నారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు ఎవరు అవరోధం కలిగించాలని చూసినా కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఈసీ హెచ్చరించారు. అలాంటి వ్యక్తుల కదలికల్ని నిశితంగా గమనించాలని.. సమస్యలు సృష్టించేవారిపై కఠినంగా వ్యవహరించాలని పోలీసు శాఖను ఆదేశించారు. గత అనుభవాల దృష్ట్యా.. ఈసారి జరిగే ఏకగ్రీవాలపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు.

ఓవైపు ఎన్నికలు, మరోవైపు కరోనా టీకాలిచ్చే కార్యక్రమం సజావుగా జరిగేలా ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పని చేస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో కరోనా రక్షణ చర్యల్ని అత్యున్నత ప్రమాణాలతో చేపట్టాలి. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేవారందరికీ కరోనా రక్షణ సామగ్రి సమకూర్చాలి అన్నారు. ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయన్నారు. ఎన్నికలకు సంబంధించిన అంశాల్లో సంబంధిత ప్రభుత్వ విభాగాలు, అధికారులు, కలెక్టర్లు ఎస్‌ఈసీ ఆధ్వర్యంలోనే పనిచేయాలి. ఎన్నికలకు సంబంధించి ఎస్‌ఈసీ చెప్పేదే తుది నిర్ణయం. ఎన్నికలకు అవసరమైన రవాణా, ఆర్థిక వనరులు సమకూర్చడం వంటి బాధ్యతలన్నీ పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌ పర్యవేక్షించాలి అన్నారు.

ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే కోడ్‌ అమల్లోకి వచ్చిందన్నారు ఎస్ఈసీ. అమలు బాధ్యత కలెక్టర్లు, ఎస్పీలదే.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినవారు ఎంత పెద్దవారైనా తీవ్ర పరిణామాలు తప్పవు అన్నారు. ఎన్నికల నామినేషన్ల వ్యవహారంలో ఏమైనా సమస్యలు తలెత్తినా, ఫిర్యాదులు వచ్చినా, అవకతవకలు జరిగినా కమిషన్‌ తక్షణం పరిష్కరిస్తుందన్నారు. ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకుగానీ, పోటీ చేసే అభ్యర్థుల్ని లక్ష్యంగా చేసుకునిగానీ ఎలాంటి చర్యలకు దిగినా సహించేది లేదన్నారు. అభ్యర్థులకు కమిషన్‌ పూర్తి భద్రత కల్పిస్తుందంన్నారు.

మొదటి దశ ఎన్నికల ప్రక్రియ ఇలా కొనసాగనుంది. ఇవాళ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలకానుంది. ఈ నెల 25 అభ్యర్థులనుంచి నామినేషన్ల స్వీకరణ.. 27 నామినేషన్ల దాఖలుకు తుది గడువు. 28న నామినేషన్ల పరిశీలన.. 29న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలిస్తారు. 30న ఈ అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకుని.. 31న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఉంటుంది. తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారు. ఫిబ్రవరి 5న పోలింగ్‌.. (ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 మధ్య పోలింగ్‌). పోలింగ్‌ ప్రక్రియ పూర్తయ్యాక 4గంటల నుంచి ఓట్ల లెక్కింపు.. ఫలితాలు వెల్లడిస్తారు. దీని తర్వాత ఉపసర్పంచి ఎన్నికను పూర్తి చేయటంతో మొదటి విడత ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.