యాప్నగరం

ఏపీ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

Ap Weather Update ఏపీలో మారిపోయిన వాతావరణ పరిస్థితులు. వర్షాల నుంచి జనాలకు రిలీఫ్ దక్కితే.. మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. బుధవారం నుంచి భానుడి భగభగలు మొదలయ్యాయి. వేడిగాలలుతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అప్పుడు టెంపరేచర్ 40 డిగ్రీలకు పైగా నమోదవుతోంది. గురువారం 45 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది అంటున్నారు. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజల్ని అలర్ట్ చేసింది. అలాగే మోచా తుఫాన్ ప్రభావం ఏపీపై ఉండదంటోంది వాతావరణశాఖ.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 11 May 2023, 1:34 pm

ప్రధానాంశాలు:

  • ఏపీలో మారిపోయిన వాతావరణం
  • మళ్లీ మొదలైన ఎండల ప్రభావం
  • 45 మండలాల్లో మళ్లీ వేడి గాలులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Ap Heat Waves
Ap Weather Today: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలకు బ్రేక్ పడింది. బుధవారం నుంచి మళ్లీ వాతావరణం మారిపోయింది.. మళ్లీ ఎండలు, వేడి గాలులు మొదలయ్యాయి. గురువారం అల్లూరి జిల్లా రాజవొమ్మంగి, అనకాపల్లి జిల్లా నాతవరం, కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో తీవ్రవడగాల్పులు (Ap Heat Waves) వీచే అవకాశం ఉంది అని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ 45, శుక్రవారం 104 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. మిగిలిన చోట్ల ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని.. ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
బుధవారం పల్నాడు జిల్లా రెంటచింతల, కడపలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఏపీ వెదర్ మ్యాన్ అంటున్నారు. గురువారం ఇంకా ఎండలు మండిపోతాయని.. ఈ నెల 13నాటికి 44 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు టచ్ అవుతుందని అంచనా వేశారు. చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంటుంది అంటున్నారు. ఎండలకు తోడు వేడి గాలులు వీస్తాయంటున్నారు.
గత పది రోజులుగా వర్షాలు పడుతుండగా.. మెల్లిగా తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో ఎండలు కూడా మండిపోతున్నాయి. మొన్నటి వరకు చల్లగా ఉన్న వాతావరణంతో ఎంజాయ్ చేసిన జనాలు.. ఉన్నట్టుండి పెరిగిన ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు 40 నుంచి 41 డిగ్రీలకు పెరిగింది. అయితే అనంతపురం, సత్యసాయి జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మాత్రం తేలికపాటి వర్షాలు పడ్డాయి.
Ap Mocha Cyclone: మరోవైపు బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ బుధవారం సాయంత్రానికి తుఫాన్‌గా మారింది. అది క్రమంగా గురువారం ఉదయానికి తీవ్ర తుఫాన్‌గా.. ఎల్లుండికి అతి తీవ్రమైన తుఫాన్‌గా మారుతుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతూ శనివారం నుంచి స్వల్పంగా బలహీనపడుతూ.. ఆదివారం మధ్యాహ్నానికి కాక్స్ బజార్ (బంగ్లాదేశ్), క్యుక్ప్యు (మయన్మార్) మధ్య ఆగ్నేయ బంగ్లాదేశ్, ఉత్తర మయన్మార్ వద్ద తీరాలను దాటే అవకాశం ఉంది. ఈ తుఫాన్ ప్రభావం ఏపీపై ఉండదని వాతావరణశాఖ చెబుతోంది. కాకపోతే అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయంటున్నారు. అది కూడా ఈ నెల 13, 14న వానలకు అవకాశం ఉందంటున్నారు. మోచా తుఫాన్ ప్రభావం ఏపీపై లేదని వాతావరణశాఖ అధికారులు తెలపడంతో మొన్నటి వరకు వర్షాలతో అల్లాడిపోయిన రైతులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. వర్షానికి తడిచిన ధాన్యాన్ని మళ్లీ ఎండకు ఆరబెట్టుకుంటున్నారు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.