యాప్నగరం

Pawan Kalyan: పవన్‌ను కలిసిన బీజేపీ ఎంపీలు.. రాజకీయమా? అభిమానమా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను బీజేపీకి చెందిన యువ ఎంపీలు కలిసి మాట్లాడారు. మైసూరు ఎంపీ ప్రతాప్ సింహ, బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య జనసేనానితో భేటీ అయ్యారు.

Samayam Telugu 5 Jan 2020, 8:08 pm
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు యూత్‌లో ఎంత ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలుగునాటే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటకలోనూ భారీ క్రేజ్ ఉంది. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు.. ఫ్యాన్స్ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. హిట్లు ప్లాప్‌‌లకు అతీతంగా ఆయన ప్రయాణం కొనసాగింది. రాజకీయాల్లోనూ ఫలితాలకు అతీతంగా ఆయన ముందుకెళ్తున్నారు.
Samayam Telugu bjp mps meet pawan kalyan


జనసేనాని పవన్ కళ్యాణ్ బీజేపీకి చెందిన ఇద్దరు యువ ఎంపీలు ఆదివారం కలిశారు. కర్ణాటకకు చెందిన ఈ ఇద్దరు ఎంపీలు.. పవన్‌ను కలిసి తెగ ఆనందపడిపోయారు. బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య, మైసూరు ఎంపీ ప్రతాప్ సింహా.. పవన్‌ను కలిశారు. ఈ విషయాన్ని మైసూరు ఎంపీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

‘‘నేను ఆయన సినిమాలను చూసేవాణ్ని. కాలేజీ రోజుల్లో ఆయన్నెంతగానో అభిమానించే వాణ్ని. ఈ రోజు నేను, తేజస్వి సూర్య ఆయన్ను కలిసి మాట్లాడే అవకాశం లభించింది. థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ సర్, విశ్వ గారూ’’ అని ప్రతాప్ సింహా ట్వీట్ చేశారు. ఈ భేటీలో నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారని ఫొటోలను బట్టి అర్థం అవుతోంది.

బీజేపీ నేతలు తనకు బాగా తెలుసని పవన్ కళ్యాణ్ పదే పదే అంటుంటారు. జగన్ సర్కారు సమస్యల పరిష్కారంపై తగిన రీతిలో స్పందించికపోతే.. ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలుస్తానని ఆయన హెచ్చరించారు. మోదీ, అమిత్ షాలకు తనంటే ఎంతో అభిమానం అన్నారు. పవన్ బీజేపీకి దగ్గరవుతున్నారని ప్రచారం జరుగుతున్న వేళ.. కమలం పార్టీకి చెందిన, పొరుగు రాష్ట్రానికి చెందిన యువ ఎంపీలు ఆయన్ను కలవడం ఆసక్తికరంగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.