యాప్నగరం

సీఎం జగన్ ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందే.. ఎంపీ జీవీఎల్ డిమాండ్

రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్మోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఆయన నెరవేర్చలేదన్నారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 17 Aug 2022, 8:30 pm
Samayam Telugu జీవీఎల్ నరసింహారావు
రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని భారతీయ జనతా పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. విశాఖపట్నం- చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఎందుకు డీపీఆర్ పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు.

రాష్ట్రంలో అన్ని పథకాల లబ్ధిదారులకు నిజయమైన సమాచారం అందించడానికి త్వరలోనే బీజేపీ కార్యాలయంలోనే ఒక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని ఎంపీ జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. ఇక, విశాఖపట్నంలో 22 ఏ సెక్షన్ సమస్య ఉందన్నారు. 22 ఏ పేరుతో 30 వేల మందికి రిజిస్ట్రేషన్ చేసుకునే అధికారం లేకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు.

15 రోజుల్లో ఈ సెక్షన్ 22 ఏ తీసివేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎంపీ జీవీఎల్ డిమాండ్ చేశారు. ఈ 22 ఏ బాధితులకు అండగా నిలుస్తామని వెల్లడించారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులు 9 గంటల్లోపు యాప్ ద్వారా హాజరు నమోదు చేసుకోవాలనే విధానం పెట్టడం దారుణమన్నారు. ఏ ప్రభుత్వంలోనైనా ఎక్కువ పని చేసేది టీచర్లేనని.. మిగిలిన శాఖల అధికారులు టైంకి వస్తున్నారా అని ప్రశ్నించారు. అసలు, మీ మంత్రులు సచివాలయానికి సమయానికి వస్తారా అని నిలదీశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం వర్క్ ఫ్రం హోమ్ చేస్తారని ఎద్దేవా చేశారు. కానీ, ప్రభుత్వ టీచర్లపై మాత్రం కక్ష సాధింపు చేస్తున్నారని మండిపడ్డారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.