యాప్నగరం

చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవదహనం

తిరుపతి నుంచి బెంగళూరుకు కారులో బయలుదేరిన ఓ కుటుంబం మార్గమధ్యలో ప్రమాదానికి గురయ్యింది. వారు ప్రయాణిస్తోన్న వాహనం అదుపుతప్పి బోల్తా పడింది.

Samayam Telugu 14 Sep 2019, 10:26 am
చిత్తూరు జిల్లాలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. ప్రయాణిస్తోన్న కారులో మంటలు చెలరేగి ఐదుగురు సజీవదహనమయ్యారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. తిరుపతి నుంచి బెంగుళూరు వైపు వెళ్తోన్న వాహనం.. గంగవరం మండలం మామడుగు సమీపంలోకి రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. ఒకరు తీవ్ర గాయాలతో బయట పడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఆరుగురు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Samayam Telugu fire-break_3


మంటలను అదుపుచేసి కారులో నుంచి మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని వైద్యం కోసం కేసు పలమనేరు హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కాగా వారి స్వస్థలం తిరుపతి. విష్ణు అనే వ్యక్తి గాయాలతో బయటపడగా, జాహ్నవి, కళ, భానుతేజ, పవన్ సాయి, ఆశ్రిత సజీవదహనమయ్యారు. వీరిలో ఇద్దరు చిన్నారులు సైతం ఉంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

పోలీసుల కథనం ప్రకారం.. తిరుపతి టీఎంసీ సిగ్నల్‌ ప్రాంతానికి చెందిన విష్ణు సోదరి కళ బెంగుళూరులో ఉంటోంది. ఇటీవల కళ, ఆమె కుమారుడు భానుతేజ తిరుపతికి వచ్చారు. ఆమెను బెంగళూరుకు సాగనంపడానికి విష్ణు, అతడి భార్య జాహ్నవి, కుమారుడు పవన్‌రాం, కుమార్తె సాయిఅశ్వితలు శనివారం ఉదయం బయలుదేరారు. మార్గమధ్యంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో విష్ణు మినహా అందరూ సజీవదహనమయ్యారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.