యాప్నగరం

ఏపీలో టెన్త్ పరీక్షలు రద్దు చేయాల్సిందే.. జగన్ సర్కారుకు సీఎఫ్ఐ వినతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న తరుణంలో పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని సీఎఫ్ఐ కార్యదర్శి డిమాండ్ చేశారు.

Samayam Telugu 19 Apr 2021, 9:47 pm
Samayam Telugu టెన్త్ పరీక్షలు రద్దు చేయాలని సీఎఫ్ఐ వినతి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఐ) రాష్ట్ర కార్యదర్శి కె.లలిత్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సీబీఎస్ఈతో పాటు పలు రాష్ట్రాలు కూడా పరీక్షలను రద్దు చేశాయని గుర్తు చేశారు. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడం మానేశారని పేర్కొన్నారు.


పదో తరగతి విద్యార్థులను పాస్ చేసి ఆన్‌లైన్ ద్వారా 2 నెలలు ఫౌండేషన్ కోర్స్‌లు నేర్పించాలని లలిత్ కుమార్ కోరారు. అలాగే ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు జనరల్ ప్రమోషన్ ఇవ్వాలన్నారు. అరకొర శిక్షణతో తమకు పరీక్షలు నిర్వహిస్తే మంచి మార్కులు రావేమోనని విద్యార్థులు మానసిక ఆందోళనకు గురుతున్నారని లలిత్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న తరుణంలో సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 9 తరగతులకు సెలవులు ప్రకటించామన్నారు. అయితే పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ఈ తరుణంలో టెన్త్, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలని లలిత్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.