యాప్నగరం

చీరాల వైసీపీలో వర్గపోరు.. నడిరోడ్డుపై కొట్టుకున్న కరణం, ఆమంచి వర్గీయులు

చీరాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కరణం బలరాం, ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులు బాహాబాహీకి దిగారు. ఈ ఘటనలో ఏడుగురు గాయాలపాలయ్యారు.

Samayam Telugu 30 May 2020, 6:26 pm
చీరాల నియోజకవర్గంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామాపురంలో వైసీపీ నేతలు కరణం బలరాం కృష్ణమూర్తి, ఆమంచి కృష్ణమోహన్ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవల్లో ఏడుగురు గాయాలపాలయ్యారు. గాయపడ్డ వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. గ్రామ కాపును ఎన్నుకునే విషయంలో వారం రోజులుగా ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగుతోంది. రామలింగయ్య అనే వ్యక్తి స్థలంలో రాజారావుకు చెందిన కర్రలను తీయమనటంతో గొడవ జరిగినట్లు తెలుస్తోంది.
Samayam Telugu వైసీపీ నేతల ఘర్షణ


కాగా, నాయకులు సైలెంట్‌గా ఉన్నా.. వారి వర్గీయుల మధ్య పచ్చగడ్డి వస్తే బగ్గుమంటోంది. ఇటీవల టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్ వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. బలరాం వైసీపీలో అధికారికంగా చేరకపోయినా.. ఆయనే దగ్గరుండి మరీ వైసీపీ అధినేత, సీఎం జగన్ సమక్షంలో కుమారుడు వెంకటేష్‌ను పార్టీలో చేర్పించారు. అలాగే అనధికారికంగా వైసీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇది చీరాల వైసీపీ ఇన్‌చార్జిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులకు ఈ విషయం మిగుడు పడటం లేదు. ఆమంచి సైతం ఎన్నికల ముందే టీడీపీ నుంచి వైసీపీలోకి చేరారు.

దీంతో చీరాలలో వైసీపీ కార్యక్రమాలను విడివిడిగా నిర్వహించుకుంటున్నారు. ఇదే క్రమంలో రామాపురంలో జరిగిన చిన్న గొడవ.. ఇరువర్గాల గొడవగా మారిపోయింది. ఒకరితో ఒకరు బాహాబాహికి దిగటంతో ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు సమయానికి అక్కడే ఉండటంతో అందరినీ చెదరగొట్టారు. ఇద్దరు నేతల వ్యవహారాన్ని వైసీపీ అధిష్టానం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.