యాప్నగరం

శాశ్వతంగా టెలీ మెడిసిన్‌, ఆ జిల్లాకు ప్రత్యేక అధికారి.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

YS Jagan: కరోనా వైరస్ నియంత్రణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో టెలీ మెడిసిన్‌ను శాశ్వత ప్రాతిపదికన నడపాలని అధికారులను ఆదేశించారు.

Samayam Telugu 25 Apr 2020, 4:34 pm
కరోనా వైరస్ వంటి విపత్తులను ఎదుర్కోవడానికి వైద్య, ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగు పర్చుకోవాల్సిన అవసరం చాలా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. రాబోయే రోజుల్లో గ్రామాల్లో విలేజ్‌ క్లినిక్స్‌ కీలక పాత్ర పోషిస్తాయని సీఎం జగన్ వెల్లడించారు. కోవిడ్- 19 నిరోధక చర్యలపై సీఎం జగన్ శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో కరోనా కేసులు వెలుగు చూసినందున ఆ జిల్లాలో పర్యవేక్షణకు ఓ ప్రత్యేక అధికారిని నియమించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
Samayam Telugu సీఎం జగన్


కరోనా పరీక్షల కోసం ల్యాబ్‌లు లేని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇదివరకే నిర్ణయించిన విధంగా కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిని కోవిడ్‌ ఆస్పత్రిగా మార్చాలని సీఎం స్పష్టం చేశారు. ఏపీలో టెలీ మెడిసిన్‌ను శాశ్వత ప్రాతిపదికన నడపాలని సీఎం ఆదేశించారు. కాల్‌ చేసిన వారికి ప్రిస్కిప్షన్లు ఇవ్వడమే కాకుండా వారికి మందులు కూడా పంపించాలని, దీనివల్ల ప్రజలకు మరింత మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. టెలీమెడిసిన్‌ టోల్ ఫ్రీ నెంబరు 14410కు మరింత ప్రచారం కల్పించాలని సీఎం సూచించారు.

అలాగే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి భౌతిక దూరం పాటిస్తూ అనుమతించిన ప్రాంతాల్లో పరిశ్రమలు, ఇతర వ్యవసాయ కార్యకలాపాలు కొనసాగించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో పని చేస్తున్న వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ప్యాకింగ్, ప్రాథమిక ప్రాసెసింగ్, విక్రయాలు కోసం చేపట్టనున్న జనతా బజార్ల ఆలోచనకు మంచి మద్దతు లభిస్తోందని ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు సీఎంకు వివరించారు. ఒక్కరోజే 6,928 కరోనా పరీక్షలు చేయించామని సీఎం జగన్‌కు అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 61,266 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు తెలిపారు. ప్రతి 10 లక్షల మందికి 1,147 మందికి పరీక్షలు చేసి దేశంలోనే ప్రథమ స్థానంలో ఏపీ నిలిచినట్లు అధికారులు వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.