యాప్నగరం

Jagan Review: నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్ చెప్పిన ముఖ్యమంత్రి

Jagan Review: స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీతో పాటు.. పదోన్నతుల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం జగన్ ఆదేశించారు. 63 సీడీపీఓ పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. వీటిని వీలైనంత త్వరగా భర్తీచేయాలని సూచించారు. మహిళా, శిశు సంక్షేమశాఖపై సమీక్ష నిర్వహించిన జగన్.. నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్ చెప్పారు. అలాగే.. చిన్నారులకు మంచి వాతావరణం అందించాలని అధికారులకు పలు సూచనలు చేశారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 10 Jan 2023, 7:16 pm

ప్రధానాంశాలు:

  • మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం జగన్‌ సమీక్ష
  • 63 సీడీపీఓ పోస్టుల భర్తీకి సీఎం జ‌గ‌న్‌ గ్రీన్‌ సిగ్నల్
  • చిన్నారులకు మంచి వాతావరణం అందించాలని ఆదేశం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Jagan Review
సీఎం జగన్ సమీక్ష
Jagan Review: నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్ చెప్పారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీతో పాటు.. పదోన్నతుల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. 63 సీడీపీఓ (CDPO) పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటిని వీలైనంత త్వరగా భర్తీచేయాలని సూచించారు. మహిళా శిశు సంక్షేమశాఖపై సీఎం జగన్‌ సమీక్షనిర్వహించారు. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా చిన్నారులకు మంచి వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.
'అంగ‌న్ వాడీల్లో నాడు-నేడు కార్య‌క్ర‌మానికి ప్ర‌భుత్వం దాదాపు రూ.1500 కోట్లకు పైగా ఖర్చుచేస్తోంది. మూడు విడతల్లో ప‌నులు చేప‌ట్టాలి. మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడాలి. పనుల్లో నాణ్యత ఉండాలి, చిన్నారులకు మంచి వాతావరణం అందించాలి. ప్రతి మండలంలోనూ పనులు జరిగేలా కార్యాచరణ రూపొందించాలి. అంగన్‌వాడీలలో నిరంతర పర్యవేక్షణ ఉండాలి. పాలు, గుడ్లు లాంటి ఆహారం పంపిణీలో ఎలాంటి సమస్యలు ఉండకూడదు. వీటి పంపిణీపై సమగ్ర పర్యవేక్షణ, పరిశీలన ఉండాలి. సమగ్రమైన ఎస్‌ఓపీలు రూపొందించుకోవాలి. టెక్నాలజీ వాడుకోవాలి' అని సీఎం జగన్ ఆదేశించారు.

'సూపర్‌వైజర్లపైనా పర్యవేక్షణ ఉండాలి. నూరుశాతం పిల్లలకు పాలు పంపిణీ కావాలి. అలాగే పిల్లలకు ఫ్లేవర్డ్‌ పాలు పంపిణీని పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించాలి. మూడు నెలల తర్వాత పూర్తిస్థాయిలో ఫ్లేవర్డ్‌ మిల్క్‌ పంపిణీ కావాలి. ఈ మేరకు షెడ్యూల్‌ రూపొందించుకోవాలి. అంగన్‌వాడీలలో బోధనపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఉత్తమ బోధనలను అందుబాటులోకి తీసుకురావాలి. స్మార్ట్‌ టీవీల ద్వారా డిజిటల్‌ పద్ధతుల్లో బోధనపై ఆలోచనలు చేసి.. ప్రతిపాదనలు రూపొందించాలి. పిల్లల ఆరోగ్య పరిస్థితులపై విలేజ్, వార్డు క్లినిక్స్‌ ద్వారా పరిశీలన చేయించాలి' అని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

'వైద్యపరంగా ఎలాంటి చికిత్సలు అవసరమైనా.. ఆరోగ్యశ్రీని వినియోగించుకుని వారికి మెరుగైన వైద్యం అందించేలా చూడాలి. తల్లికానీ, బిడ్డకానీ.. ఎవరైనా రక్తహీనత, పౌష్టికాహారలోపం లాంటి సమస్యలతో బాధపడుతుంటే.. వాటిని నివారించడానికి సమగ్రమైన కార్యాచరణ ఉండాలి. ఈ విషయంలో అంగన్‌వాడీలు, విలేజ్‌ క్లినిక్స్, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంతో పనిచేయాలి. ఇలాంటి సమస్యలు ఉన్నవారికి అందరితోపాటు ఇచ్చే ఆహారం, మందులు కాకుండా.. అదనంగా ఇస్తూ.. వీరి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలి. దీనిపై ఎస్‌ఓపీలను తయారు చేయాలి. ఫిబ్రవరి 1 నుంచి దీన్ని అమలు చేయాలి' అని సీఎం జగన్ సూచించారు.

'తల్లులకు టేక్‌ హోం రేషన్‌ విధానంపై ఆలోచన చేయాలి. దీనికోసం లోపాలకు తావులేని విధానాన్ని రూపొందించాలి. అంగన్‌వాడీలు, ప్రభుత్వ బడుల్లో బలహీనవర్గాలకు చెందిన పిల్లలే అధికంగా ఉంటారు. ఈ వర్గాలకు చెందిన పిల్లలకు తోడుగా నిలబడాల్సిన అవసరం ఉంది. వారి పట్ల సానుకూల దృక్ప‌థంతో పనిచేయాలి. 10–12 ఏళ్ల వయస్సులో మంచి బోధన అందించడం ద్వారా ఉత్తమైన ఫలితాలు సాధించవచ్చు. విద్య, వ్యవసాయం, వైద్య ఆరోగ్యం తరహాలో మహిళ, శిశు సంక్షేమాన్ని కూడా ప్రభుత్వం ప్రాధాన్య కార్యక్రమంగా చేపట్టింది' అని జగన్ వ్యాఖ్యానించారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.