యాప్నగరం

ఆ గిరిజన దంపతులకు సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలి.. పవన్ కళ్యాణ్ డిమాండ్‌

కేజీహెచ్‌లో మృతి చెందిన చిన్న బిడ్డను తరలించేందుకు అంబులెన్స్‌ ఇవ్వలేని సీఎం జగన్మోహన్ రెడ్డి.. విశాఖపట్నంను రాజధానిగా అభివృద్ధి చేస్తామంటే ఎలా నమ్మాలని జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 16 Feb 2023, 9:03 pm
విశాఖపట్నం కేజీహెచ్‌లో చనిపోయిన బిడ్డను తరలించేందుకు అంబులెన్స్‌ ఇవ్వని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. విశాఖను రాజధానిగా అభివృద్ధి చేస్తామంటే ఎలా నమ్మాలని జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ సూటిగా ప్రశ్నించారు. బిడ్డ మృతదేహాన్ని తీసుకుని 120 కిలో మీటర్లు ద్విచక్రవాహనంపై వెళ్లిన ఆ గిరిజన దంపతులకు సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. పాడేరు ప్రాంతంలోని కుమడ గ్రామానికి చెందిన మహేశ్వరి, కొండబాబు దంపతుల పుట్టెడు శోకాన్ని దిగమింగుకొని బిడ్డ మృతదేహాన్ని తీసుకెళ్లడాన్ని చూసి ఎవరికైనా గుండె తరుక్కుపోతుందన్నారు.
Samayam Telugu సీఎం జగన్‌పై పవన్ కళ్యాణ్ ఫైర్


కానీ, ఈ రాతి గుండె ప్రభుత్వంలో మాత్రం కనీస స్పందన లేదని పవ్ కళ్యాణ్ దుయ్యబట్టారు. కేజీహెచ్‌లో గిరిజనులకు సాయపడేందుకు ఎస్టీ సెల్‌ ఉన్నా, ఆస్పత్రిలో ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం అమానవీయమన్నారు. ఆసుపత్రుల నిర్వహణ, ప్రజారోగ్యంపై పాలకుల అశ్రద్ధకు ఈ ఘటనే నిదర్శనమన్నారు.


కొద్ది నెలల క్రితమే తిరుపతి రుయా ఆస్పత్రి నుంచి బిడ్డ మృతదేహాన్ని తరలించేందుకు ఓ తండ్రి పడిన ఇబ్బందులను కూడా పవన్‌ కళ్యాణ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే మచిలీపట్నం సముద్ర తీరంలో ఓ బాలుడు చనిపోతే ఆ బిడ్డ మృతదేహాన్ని బంధువులు బైక్‌ మీద తీసుకెళ్లారని పేర్కొన్నారు. ప్రభుత్వం గొప్పగా చెబుతున్న మహాప్రస్థానం వాహనాల పథకం ఏమైందని ప్రశ్నించారు.

బెంజి సర్కిల్‌లో అంబులెన్స్‌లు నిలబెట్టి డ్రోన్‌ విజువల్స్‌ తీసి జెండా ఊపితే చాలదని పవన్ కళ్యాణ్ అన్నారు. వైద్య, ఆరోగ్య శాఖకు రూ. 14 వేల కోట్ల బడ్జెట్‌ ఇచ్చినట్లు గొప్పలు చెప్పటం మాని.. క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలు అందేలా చూడాలని హితవుపలికారు. ఆస్పత్రుల్లో కనీస సదుపాయాలు కల్పించ లేని పాలకులు తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు విశాఖను రాజధానిగా అభివృద్ధి చేస్తామన్నారు. ఇక, అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని మాయ మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని పవన్‌ కళ్యాణ్ దుయ్యబట్టారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.