యాప్నగరం

శ్రీకాకుళం జిల్లాలో కరోనా కలకలం.. ఉలిక్కిపడ్డ ఉత్తరాంధ్ర!

ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాత్రమే ఇప్పటి వరకూ కరోనా కేసులు నమోదు కాలేదు. కాగా శ్రీకాకుళం జిల్లాలో ఒకరికి కరోనా సోకిందనే ప్రచారం ప్రజలను ఆందోళనకు గురి చేసింది.

Samayam Telugu 23 Apr 2020, 9:29 pm
ఆంధ్రప్రదేశ్‌లోని 11 జిల్లాల్లో కరోనా కేసులు నమోదు కాగా.. ఇప్పటి వరకూ కేవలం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాత్రమే కోవిడ్ కేసలు నమోదు కాలేదు. కాగా కరోనా కలకలంతో శ్రీకాకుళం జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఓ వ్యక్తికి కరోనా సోకిందనే ప్రచారంతో జనం భయాందోళనలకు లోనయ్యారు. మార్చి నెలలో ఢిల్లీ వెళ్లొచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలినట్లు ప్రచారం జరుగుతోంది. స్థానిక మీడియాలోనూ కథనాలు వెలువడ్డాయి. కాగా ఈ విషయంలో ప్రభుత్వం నుంచి అధికార ప్రకటన ఇంకా వెలువడలేదు.
Samayam Telugu corona virus test


శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలానికి చెందిన ఓ యువకుడు ఢిల్లీలో రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు. ర్యాపిడ్ టెస్ట్ చేయగా.. పాజిటివ్ రావడంతో.. ట్రూనాట్ పరికరం ద్వారా రిమ్స్‌లో మరోసారి పరీక్షించేందుకు ఆ వ్యక్తిని శ్రీకాకుళం తీసుకెళ్లారని ప్రచారం జరుగుతోంది. మార్చి నెలలో ఢిల్లీ నుంచి వచ్చిన అతడు అధికారుల సూచనల మేరకు 14 రోజులపాటు అత్తారింట్లో క్వారంటైన్‌లో ఉన్నాడు. క్వారంటైన్ ముగిసిన తర్వాత ఆయన బయటకు వచ్చి కొందరిని కలిసినట్లు సమాచారం. ఆయనకు భార్య, ఓ చిన్న బాబు ఉన్నారు.

కాగా సదరు వ్యక్తికి కరోనా నిర్ధారణ కాలేదని కూడా ప్రచారం జరుగుతోంది. పరీక్షల్లో కరోనా సస్పెక్టెడ్ అని మాత్రమే వచ్చిందని.. కరోనా నిర్ధారణ కాలేదని చెబుతున్నారు. ఎవరూ ఆందోళన చెందొద్దని.. అధికారులు చెబుతున్నారు. జిల్లా అధికారులను ‘సమయం’ సంప్రదించగా.. శాంపిళ్లను కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలోని ల్యాబ్‌కు పంపించామని, రిపోర్టులు రావాల్సి ఉందని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.