యాప్నగరం

దసరా ఉత్సవాలు: కళ్లు చెదిరేలా బెజవాడ దుర్గమ్మ హుండీ ఆదాయం.. ఎన్ని రూ. కోట్లంటే..!

దసరా సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మను 1.36 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.

Samayam Telugu 27 Oct 2020, 5:28 pm
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరిగాయి. కరోనా కష్టకాలంలోనూ అశేష సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని భారీగా కానుకలు సమర్పించారు. ఈ మేరకు దుర్గమ్మ ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ పైలా సోమినాయుడు, ఈవో ఎంవీ సురేష్‌బాబు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. దసరా సందర్భంగా ఈ ఏడాది 2,36,182 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు వెల్లడించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


85,058 మంది భక్తులు ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు తీసుకున్నారని, వారిలో దాదాపు 35 వేల మంది భక్తులు దర్శనానికి రాలేకపోయినట్లు గుర్తించినట్లు వారు చెప్పారు. ఆన్‌లైన్‌తో పాటు దూరప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి వచ్చిన వారికి 1,51,124 టికెట్లు అందజేసినట్లు పేర్కొన్నారు. నవరాత్రుల సందర్భంగా టికెట్లు, లడ్డూ ప్రసాదాలు, పరోక్ష కుంకుమార్చనలు, చీరల వేలం, ఇతర మార్గాల ద్వారా ఆలయానికి రూ.4.36 కోట్ల వరకు ఆదాయం సమకూరినట్లు వివరించారు.

కోవిడ్ 19 లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా ఉత్సవాలను నిర్వహించామని.. కరోనా కారణంగా ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా సాధారణ భక్తులు, భవానీ దీక్షాపరులు చక్కగా సహకరించారని వారు ఆనందం వ్యక్తం చేశారు. భక్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో ఉత్సవాలను సజావుగా నిర్వహించినట్లు వివరించారు. మూలానక్షత్రం రోజున కొండచరియలు విరిగిపడిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి స్వయంగా పరిశీలించి.. దేవాలయ అభివృద్ధికి రూ. 70 కోట్ల నిధులు మంజూరు చేశారని వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.