యాప్నగరం

గోదావరి బోటు వెలికితీత.. తొలి రోజు నిరాశ.. నేడు ఇలా..

గోదావరిలో మునిగిన బోటును వెలికితీయడానికి ప్రయత్నాలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. తొలి రోజు ధర్మాడి సత్యం టీం చేసిన ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వలేదు. మంగళవారం మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించనున్నారు.

Samayam Telugu 1 Oct 2019, 8:12 am
తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరి నదిలో మునిగిన బోటును బయటికి తీయడానికి సోమవారం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ధర్మాడి సత్యం నాయకత్వంలోని 25 మంది బృందం బోటు కోసం గాలింపు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. తొలి రోజు వీరి అనేష్వణ ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో మంగళవారం గాలింపు చర్యలను ప్రారంభించనున్నారు.
Samayam Telugu godavari boat accident


ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోటు, పంటుతోపాటు స్థానికులకు చెందిన ఏడు బోట్లను గాలింపు కోసం వాడుతున్నారు. ధర్మాడి సత్యం బృందం బోటు వెలికి తీస్తుందేమోననే ఆశతో సోమవారం కచ్చలూరులో బోటును మునిగిన ప్రాంతానికి భారీ సంఖ్యలో జనం చేరుకున్నారు.

అంతకుముందు బోటు వెలికి తీయడానికి నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు ప్రయత్నించినప్పటికీ.. ఫలితం దక్కలేదు. దీంతో ధర్మాడి సత్యాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. బోటు వెలికితీత కోసం ప్రభుత్వం రూ.23 లక్షలు కేటాయించింది. సోమవారం రంగంలోకి దిగిన ఆయన లాంచీ ఎర్రమట్టి బురదలో చిక్కుకుని ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

ధర్మాడి సత్యం టీం భారీ ఇనుప కొక్కేలు, ఇనుప తాళ్లను పంటు ద్వారా గోదావరిలోకి వదిలింది. దాన్ని గోదావరి ఒడ్డున ఉంచిన జేసీబీలకు కట్టారు. పంటు ద్వారా నదీ గర్భంలోకి లోపలికి లంగర్లను దించి.. ప్రమాదం జరిగిన ప్రాంతంలో గాలింపు చర్యలు ప్రారంభించారు.

లంగర్లకు లాంచీ చిక్కుకునేంత వరకు అన్వేషణ కొనసాగనుంది. ఆ తర్వాత లోతును బట్టి ఏం చేయాలనేది నిర్ణయిస్తామని ధర్మాడి సత్యం తెలిపారు.

పాపికొండలు విహారయాత్రకు 77 మందితో బయల్దేరిన బోటు సెప్టెంబర్ 15న కచ్చలూరు ప్రాంతంలో బోల్తా పడగా.. 15 మంది ఆచూకీ ఇప్పటికీ దొరకని సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.