యాప్నగరం

'జగన్ కోర్టుకు హాజరైతే రూ.60లక్షలు ఖర్చు.. ఆయనే భరించాలి'

కోర్టుకు హాజరైతే ప్రభుత్వం ధనం వృథా అవుతుందన్న జగన్.. ప్రత్యేక సలహాదారుల పేరుతో ఎందుకు లక్షలకు లక్షలు జీతాలు ఇస్తున్నారు. జగన్‌కు నిబద్దత ఉంటే కోర్టుకు హాజరయ్యేందుకు అయ్యే ఖర్చును సొంతగా భరించాలి.

Samayam Telugu 19 Oct 2019, 5:45 pm
ప్రజాధనం వృథా పేరుతో ముఖ్యమంత్రి జగన్‌ కోర్టుకు వెళ్లకుండా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. జగన్ కోర్టుకు హాజరైతే రూ.60 లక్షల ఖర్చు అవుతోందని.. సొంత కేసులే కాబట్టి ఆ ఖర్చు కూడా తనే భరించాలని చెప్పారు. అవినీతి కేసుల్లో సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం మరింత పెరిగిందన్నారు. సహ నిందితులు, సాక్ష్యులకు ఉన్నత పదవులు కట్టబెట్టడమే ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. రాజకీయనేతలపైనే కాదు.. మీడియాపై కూడా జగన్‌ కక్షసాధిస్తున్నారని మండిపడ్డారు.
Samayam Telugu cm.


జగన్ చట్టం ముందు అందరూ సమానులే అని గమనించాలని.. గతంలో శిబు సొరెన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కోర్టుకి హాజరయ్యారని గుర్తు చేశారు. కోర్టుకు హాజరైతే రూ.60 లక్షల ఖర్చు అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు యనమల. పవర్‌లో లేనప్పుడు జగన్ చేసిన అవినీతి కేసులు ఇవి.. అప్పటి కేసులకు ఇప్పుడు ప్రజల సొమ్ము ఎందుకు పెట్టాలని ప్రశ్నించారు. కేసులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని గతంలోనే సీబీఐ కోర్టు, హైకోర్టు తిరస్కరించాయన్నారు.

జగన్ సాక్ష్యుల్ని సీఎంగా ప్రభావితం చేసే అవకాశం మరింత పెరిగిందన్నారు యనమల. అధికారంతో కేసులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని.. గతం కన్నా ఇప్పుడు రెట్టింపు అయ్యింది అన్నారు. ఈ పరిస్థితుల్లో హాజరుకు మినహాయింపు అడగడం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. ప్రజాధనం వృథా వంకతో కోర్టు వాయిదాల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. ఒకవేళ ప్రజా ధనం ఆదా చేస్తుంటే.. సలహాదారుల పోస్ట్‌లు ఇంతమందికి కట్టబెట్టి.. వాళ్లకు భారీ జీతభత్యాలతో ప్రజాధనం ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారని ప్రశ్నించారు. జగన్‌కు నిబద్దత ఉంటే.. ఇవి వ్యక్తిగత కేసులు కాబట్టి.. వాటికి ప్రజాధనాన్ని వ్యయం చేయకుండా.. సొంత డబ్బులతోనే కోర్టు వాయిదాలకు హాజరు కావాలి అన్నారు.

ఇక రాష్ట్రంలో మీడియా నోరు నొక్కేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు యనమల. అసత్య వార్తలతో ప్రత్యర్ధి పార్టీలపై ప్రజల్లో దుష్ప్రచారం చేసింది ఏ మీడియానో అందరికీ తెలిసిందే అన్నారు. దీనిపై సమగ్ర చర్చకు సిద్దంగా ఉన్నామన్నారు. మీడియాను అణిచివేయడం భావ ప్రకటనా స్వేచ్ఛకు వ్యతిరేకమని.. రాష్ట్రంలో కొన్ని చానళ్లపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధిస్తోంది అన్నారు. ఇసుక కష్టాలు, విద్యుత్ కోతలు, ఇతర వ్యాపారులకు బెదిరింపులు, ఇతర పార్టీలకు వేధింపులు, ప్రత్యర్ధులపై కక్ష సాధింపులు సీఎం జగన్ స్వార్ధపూరిత ధోరణికి అద్దం పడుతున్నాయన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.