యాప్నగరం

ఎమ్మార్వో ఆఫీసులో రైతు ఆత్మహత్యాయత్నం.. సీఎం జగన్ సొంత జిల్లాలో ఘటన

ఎమ్మార్వో ఆఫీసులో పెట్రోల్ పోసుకొని నిప్పటించుకునే ప్రయత్నం చేసిన రైతు.. అడ్డుకున్న సిబ్బంది. కడప జిల్లా కొండాపురంలో ఘటన. రైతు నకిలీపాసు పుస్తకం తయారు చేసినట్లు చెబుతున్న అధికారులు.

Samayam Telugu 6 Nov 2019, 11:23 am
తెలంగాణలో అబ్దుల్లాపూర్‌మెట్ ఘటనను మరువక ముందే.. ఏపీలో ఓ రైతు ఏకంగా తహశీల్దార్ కార్యాలయంలోనే ఆత్మహత్యాయత్నం చేయడం కలకలంరేపింది. ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడపలోని కొండాపురంలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. దత్తాపురంకు చెందిన బుడిగ ఆదినారాయణ తన భూమికి సంబంధించి సమస్యపై ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్లాడు. తన వెంట తెచ్చుకున్న పెట్రోలు ఒంటిపై పోసుకొని నిప్పటించుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే చుట్టు పక్కల ఉన్న జనాలు అడ్డుకొని ఆపారు.. అతడ్ని బయటకు తీసుకొచ్చి నీళ్లు పోయడంతో ప్రమాదం తప్పింది. తన భూమికి సంబంధించిన సమస్యపై ఎమ్మార్వోను కలిసినా ఫలితం లేకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు బాధితుడు చెబుతున్నాడు
Samayam Telugu kdp


Read Also: ఏపీ: ఎమ్మార్వో విజయారెడ్డి హత్య ఎఫెక్ట్.. పత్తికొండ తహశీల్దార్ ఏం చేశారో తెలుసా

కొండాపురం మండలంలోని బుక్కపట్నంలో ఆదినారాయణ కుటుంబానికి 122 సర్వేనంబర్‌లో 10.94 ఎకరాల డీకేటీ భూమి ఉంది. ఈ భూమిలో 3.50 ఎకరాలు అదే గ్రామానికి చెందిన నరసింహ అనే వ్యక్తి గండికోట ప్రాజెక్టు కింద ముంపు పరిహారం అందుకున్నాడు. ఇక మిగిలిన భూమిపై చాలా ఏళ్లగా వివాదం నడుస్తోంది. ఈ భూమిలో 3.5 ఎకరాలు తన తండ్రి పేరు మీద ఉందని దానిని తన తల్లి పేరుకు మార్చాలని అధికారుల్ని కలిసి వినతిపత్రం ఇచ్చాడు.. కోర్టును ఆశ్రయించాడు. 1989 నుంచి ఆ భూమి తన తండ్రి పేరుపై ఉందని చెబుతున్నాడు. తన సమస్యపై ఎమ్మార్వో స్పందించకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు చెబుతున్నాడు.

ఇదిలా ఉంటే ఈ భూమికి సంబంధించిన కేసు కోర్టులో ఉందని తహశీల్దార్‌ చెబుతున్నారు. అది డీకేటీ భూమి అని.. ఆ భూమికి ఆదినారాయణ నకిలీ పాసు పుస్తకం తయారు చేసుకున్నాడంటున్నారు. ఆ పొలంపై ఆదినారాయణకు ఎలాంటి హక్కులు లేకున్నా అధికారులను బెదిరిస్తున్నట్లు రెవెన్యూ అధికారులు చెప్పుకొచ్చారు. అందుకే ఆ భూమిని ఆన్‌లైన్ చేయలేదని వివరణ ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.