యాప్నగరం

అమరావతి: సెక్రటేరియట్ ముట్టడికి విద్యార్థులు యత్నం.. తీవ్ర ఉద్రిక్తత

అమరావతిలో రైతుల ఆందోళనకు మద్దతుతెలిపిన విద్యార్థులు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్ ముట్టడికి ప్రయత్నించారు.

Samayam Telugu 22 Dec 2019, 1:16 pm
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, అధికార వికేంద్రీకరణ పేరుతో ఇక్కడ నుంచి తరలించే ఆలోచన విరమించుకోవాలని ఆ ప్రాంతంలో నిరసనలు మిన్నంటుతున్నాయి. రాజధాని మార్పునకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసనకు విద్యార్థులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసింది. మందడం వై జంక్షన్‌ వద్ద సచివాలయం ముట్టడికి విద్యార్థులు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. సచివాలయానికి వెళ్లే మార్గంలో ఇనుప కంచె వేసి ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
Samayam Telugu amar2


అయితే, పోలీసు వలయాలను చేధించికుంటూ విద్యార్థులు ముందుకు దూసుకెళ్లారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని లోనికి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపైనే బైఠాయించిన విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక రాజధాని పూర్తికాకుండా... మూడు రాజధానులు అసాధ్యమని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చకోవాలని విద్యార్థులు పేర్కొన్నారు. సచివాలయం మార్గంలో ముళ్ల కంచె వేయడంతో విద్యార్థులంతా మందడం వైపు ర్యాలీగా బయల్దేరారు. అక్కడ కూడా పోలీసులు అడ్డుకోవడంతో స్థానిక రైతులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

నిరసనలో భాగంగా ఆదివారం మహాధర్నా చేపట్టిన రైతులు మందడంలో రోడ్డుపై బైఠాయించారు. రోడ్డుకు అడ్డంగా పడవను పెట్టి రాకపోకలను అడ్డుకున్నారు. పోలీసులు అక్కడకు చేరుకుని పడవను తొలగించడం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమరావతి ప్రాంతంలో రైతుల ఆందోళనలకు పలువురు నేతలు మద్దతు తెలియజేశారు. రైతులతో పాటు 29 గ్రామాలకు చెందిన ప్రజలంతా ఈ ధర్నాకు దిగడంతో ప్రభుత్వం వారికీ సర్దిచెప్పేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.