యాప్నగరం

విజయవాడ: పసికందును అమ్మకానికి పెట్టిన తండ్రి

కన్నబిడ్డను అమ్మకానికి పెట్టిన తండ్రి.. అడ్డుకున్న తాతయ్య. ఇద్దరు కవలలు పుట్టడంతో ఒక పాపను అమ్మకానికి పెట్టిన తండ్రి. కృష్ణా జిల్లాలో బయటపడిన దారుణం.

Samayam Telugu 17 Oct 2019, 9:25 pm
కళ్లు కూడా తెరవని పసికందును అమ్మకానికి పెట్టాడో తండ్రి. భార్య, కుటుంబ సభ్యులకు తెలియనీయకుండా లక్షన్నరకు బేరం పెట్టాడు. అందరి కళ్లుగప్పి ఆస్పత్రి నుంచి బిడ్డను తీసుకెళ్లి అప్పగించాలనుకున్నాడు. విషయం తెలుసుకున్న పసికందు తాత (భార్య తండ్రి) నిలదీయడంతో ఈ వ్యవహారం బయటపడింది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం పెద అవుటుపల్లి సమీపంలో జరిగింది ఈ ఘటన.
Samayam Telugu vja.


నూజివీడు మండలం కొత్తూరు సిద్దార్థ నగర్‌కు చెందిన రాజేష్.. బాపులపాడు మండలం సింగన్నగూడెంకు చెందిన రజితను ప్రేమించాడు. రజిత తండ్రి ముందు పెళ్లికి ఒప్పుకోలేదు.. తర్వాత రాజేష్ కుటుంబం నచ్చజెప్పడంతో అంగీకరించాడు. మూడేళ్ల క్రితం రజితకు మగబిడ్డ పుట్టగా.. రెండో కాన్పులో గత వారమే ఇద్దరు కవలల్ని ప్రసవించింది. కవలలు కూడా ఇద్దరూ ఆడపిల్లలు కావడంతో రాజేష్‌ భారమని భావించాడు.

పసికందు అని కూడా చూడకుండా ఓ బిడ్డను తీసుకెళ్లి అమ్మకానికి పెట్టాలని భావించాడు. భీమవరంకు చెందిన వారితో లక్షన్నరకు బేరం కుదుర్చుకున్న రాజేష్.. ఆస్పత్రిలో తల్లి దగ్గర ఉన్న పాపను తీసుకెళ్లి వారికి అప్పగించాలని భావించాడు. ఈ క్రమంలో రాజేష్ మామకు అనుమానం వచ్చింది.. వెంటనే అల్లుడ్ని నిలదీయడంతో అమ్మకానికి పెట్టిన వ్యవహారం బయటపడింది.. ఆ వెంటనే అతడు ఆస్పత్రి నుంచి పారిపోయాడు.

రాజేష్‌పై మామ మండిపడుతున్నాడు. ఇద్దరు ఆడపిల్లలైనా తమకు భారం కాదని.. అవసరమైతే తాను పెంచుతానని చెబుతున్నాడు. అంతేకాదు బిడ్డను అమ్మకానికి పెట్టిన తన అల్లుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. ఈ వ్యవహారంపై పోలీసులు కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.