యాప్నగరం

శ్రీశైలంలో తొలి కరోనా కేసు.. భయాందోళనల్లో స్థానికులు

ఆలయ సెక్యూరిటీ సిబ్బంది కరోనా బారిన పడటంతో... అతడ్ని క్వారంటైన్‌కు తరలించారు. మరోవైపు తొలిసారిగా ఇక్కడ కరోనా కేసులు నమోదు కావడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.

Samayam Telugu 7 Jul 2020, 12:10 pm
శ్రీశైలం, సున్నిపెంట గ్రామంలో మొట్ట మొదటిసారిగా రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అందులో ఒకరు శ్రీశైలం దేవస్థానం సెక్యూరిటీ గార్డ్, మరొకరు సున్నిపెంట లంబాడి తండాకు చెందిన వ్యక్తిగా నిర్ధారణ అయ్యింది. వెంటనే వారిని అధికారులు కర్నూలు క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. మరోవైపు ఆలయ సెక్యూరిటి గార్డ్ ఎక్కడ ఎవరెవరిని కలిశారన్న దానిపై దేవస్థానం అధికారులు ఆరా తీస్తున్నారు. అతడితో సన్నిహితంగా మెలిగినవారిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించే పనిలో పడ్డారు. మరోవైపు ఇద్దరికి కరోనా పాజిటివ్ అని తేలడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
Samayam Telugu శ్రీశైలం ఆలయం
srisailam temple


ఇప్పటికే ఏపీలో ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకంలో కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. తిరుమలలో టీటీడీ సిబ్బంది వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. ఇక శ్రీకాళహస్తిలో కూడా అర్చకుడికి కరోనా సోకింది. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో పనిచేసి హోంగార్డుకు కరోనా వైరస్‌ సోకింది. దీంతో ఆ సమయంలో ఆలయంలో భక్తులకు దర్శనాల్ని అధికారులు నిలిపివేశారు.

అటు ఏపీ వ్యాప్తంగా కూడా కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గ్రామాలకు కూడా కరోనా వైరస్ విస్తరిస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు. సోమవారం ఒక్కరోజే ఏపీలో 1,322 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసులు 20 వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 16,712 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,263 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 56 మందికి.. ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో ముగ్గురికి వైరస్ సోకింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.