యాప్నగరం

క్యాబ్‌ను అమలు చేయబోమన్న ఐదు రాష్ట్రాలు.. మీకు ఆ అధికారం లేదన్న కేంద్రం!

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మత ప్రాతిపదికన పౌరసత్వం కల్పించడం ఏంటని విపక్షాలు నిలదీస్తున్నాయి. అటు ఈశాన్య రాష్ట్రాలు సైతం భగ్గుమంటున్నాయి.

Samayam Telugu 14 Dec 2019, 10:30 am
పౌరసత్వ సవరణ చట్టం (క్యాబ్) పై దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఈ చట్టంపై ఈశాన్య రాష్ట్రాలు భగ్గుమంటుంటే, ఇది రాజ్యాంగ విరుద్ధమని పశ్చిమ్ బెంగాల్, పంజాబ్, కేరళ, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిరసన వ్యక్తం చేశారు. అంతేకాదు, ఈ చట్టాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేసే ప్రసక్తేలేదని వారు తేల్చి చెప్పారు. అయితే చట్టాన్ని అమలుచేయబోమని చెప్పే అధికారం వారికి లేదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. రాజ్యాంగం 7వ షెడ్యూల్‌లో భాగమైన కేంద్ర జాబితాలో ఆ చట్టం ఉంటుందని హోం శాఖకు చెందిన ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.
Samayam Telugu cab_


ఏడో షెడ్యూల్‌లోని రక్షణ, విదేశీ వ్యవహరాలు, రైల్వే, పౌరసత్వం తదితర 91 అంశాలు కేంద్ర జాబితాలోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. అటు, పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఇదిలా ఉండగా పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసోంలో ఆందోళనలు మిన్నంటాయి. గువహటి అల్లర్ల నేపథ్యంలో జపాన్‌ ప్రధాని షింజో అబె భారత పర్యటన వాయిదా పడింది.

క్యాబ్‌పై పశ్చిమ్ బెంగాల్ సీఎం మమత మండిపడ్డారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా తాను చేసున్న పోరాటాన్ని ఆమె రెండో స్వాతంత్య్ర సమరంగా అభివర్ణించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని పశ్చిమ బెంగాల్‌లో ఎట్టిపరిస్థితుల్లోనూ అమలు కానివ్వబోనని మమత ఉద్ఘాటించారు. అంతేకాదు, బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో అభివృద్ధి అంశాలకు బదులుగా దేశాన్ని విభజిస్తామని హామీ ఇచ్చింది.. మతప్రాతిపదికన పౌరసత్వం కల్పించడం ఎందుకు? నేను దీన్ని అంగీకరించనని పేర్కొన్నారు.

లోక్‌సభ, రాజ్యసభలో సంఖ్యాబలం ఉందని బలవంతంగా బిల్లును ఆమోదింపజేశారు.. కానీ, మేము దేశాన్ని విడగొట్టడానికి అంగీకరించబోమని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని భారత లౌకికత్వంపై దాడిగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రం పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, కేరళ సీఎంలు కమల్ నాథ్, భూపేశ్‌ బఘేల్‌, విజయన్‌ కూడా తమ నిరసనను తెలిపారు.

ఎంపీ సీఎం కమల్ నాథ్ మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో తమ పార్టీ అవలంభించిన వైఖరినే అనుసరిస్తామని అన్నారు. విభజనకు విత్తనాలను నాటే ప్రక్రియలో మేం భాగం కావాలనుకోవడంలేదని ఆయన అన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని రాజ్యాంగ మౌలిక సిద్ధాంతాలపై దాడిగా కాంగ్రెస్ నేత చిదంబరం పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.