యాప్నగరం

అమరావతి శంకుస్థాపనకు ఐదేళ్లు.. అప్పుడలా, ఇప్పుడిలా

ఐదేళ్ల క్రితం ఉద్ధండరాయునిపాలెంలో అమరావతికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో అమరావతి-నాటి వైభవం-నేటి దుస్థితి పేరుతో అమరావతి జేఏసీ నిరసన కార్యక్రమాలు.

Samayam Telugu 22 Oct 2020, 8:51 am
ఏపీ రాజధానిగా అమరావతికి శంకుస్థాపన చేసి నేటికి సరిగ్గా ఐదేళ్లు. ప్రధాని మోదీతో పాటూ కేంద్ర పెద్దలు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటూ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అమరావతి అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కానీ 2019 డిసెంబర్‌లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటనతో అమరావతి రైతులు భగ్గుమన్నారు.
Samayam Telugu అమరావతి శంకుస్థాపన


రాష్ట్రంలో మూడు రాజధానులు ఉంటాయని ముఖ్యమంత్రి అన్నారు. విశాఖలో అడ్మినిస్ట్రేటివ్ కేపిటల్.. కర్నూలులో జ్యూడిషియల్ కేపిటల్.. అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్ ఉంటాయన్నారు. ఆ దిశగా అడుగులు కూడా పడ్డాయి.. దీనికి సంబంధించి జీఎన్‌ రావు కమిటీని కూడా నియమించారు.. వారు కూడా మూడు రాజధానులకు అనుకూలంగా నివేదిక సమర్పించారు. ఆ తర్వాత అసెంబ్లీలో సీఆర్డీఏ చట్టం రద్దు, మూడు రాజధానుల బిల్లుల్ని ఆమోదించి.. గవర్నర్‌కు పంపగా.. అక్కడా కూడా ఆమోద ముద్ర పడింది. కానీ ఈ వ్యవహారంపై హైకోర్టులో పిటిషనల్లు దాఖలు కావడంతో మూడు రాజధానులకు బ్రేకులు పడ్డాయి.

ఇదిలా ఉంటే.. అమరావతి ప్రాంత ప్రజలు, రైతులు శంకుస్థాపనకు ఐదేళ్లు పూర్తైన సందర్భంగా ఆ ఘట్టాన్ని గుర్తు చేసుకుంటున్నారు. 300 రోజులకు పైగా ఉద్యమం చేస్తున్న అమరావతి రైతులు.. శంకుస్థాపనకు ఐదేళ్లు పూర్తైన సందర్భంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఐదేళ్ల క్రితం ఉద్ధండరాయునిపాలెంలో అమరావతికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో అమరావతి-నాటి వైభవం-నేటి దుస్థితి పేరుతో.. శంకుస్థాపన ప్రాంతం వద్ద ఉదయం నుండి సాయంత్రం వరకు నిరసన చేయాలని నిర్ణయించారు. రాజధాని గ్రామాల రైతులు,మహిళలు ఉదయం 9 గంటలకు రాయపూడి, మందడం నుంచి పాదయాత్రగా శంకుస్థాపన జరిగిన ప్రదేశానికి చేరుకోనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఉద్దండరాయునిపాలెంలో సర్వమత ప్రార్థనలు జరుగనున్నాయి. అమరావతి చూపు - మోదీ వైపు పేరుతో వినూత్న ప్రదర్శన చేపట్టనున్నారు. రాత్రికి దీక్షా శిబిరాల వద్ద అమరావతి వెలుగు పేరుతో కాగడాలను ప్రదర్శించనున్నారు. కరోనా సూచనలు పాటిస్తూ అమరావతి ఉద్యమం సాగుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.