యాప్నగరం

Andhra Godavari Flood: గోదావరికి పోటెత్తుతున్న వరద.. ముంపులోనే గ్రామాలు

ఇంకా ముంపులోని ఉభయ గోదావరి జిల్లాల్లోని గ్రామాలు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న బాధితులు.. నిత్యావసరాలు అందిస్తున ప్రభుత్వం. పరిస్థితిని పర్యవేక్షిస్తున్న మంత్రులు, ప్రజా ప్రతినిధులు.

Samayam Telugu 5 Aug 2019, 1:12 pm
గోదావరి ఉగ్రరూపం కొనసాగుతోంది. వరద పోటెత్తుతుండటంతో గ్రామాలన్నీ ముంపులోనే ఉన్నాయి. గోదావరికి ఎగువ ప్రాంతంలో భద్రాచలంలో వరద ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టినా.. తాలిపేరు, దుమ్ముగూడెం, పేరూరు తదితర ప్రాంతాల్లో నీటిమట్టాలు పెరుగుతున్నాయి.. ఆ వరద కిందకు వస్తుండటంతో వరద మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఇటు ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద రెండో నంబర్‌ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం నీటిమట్టం 13.70 అడుగులుగా ఉంది. సముద్రంలోకి 12.80 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగించనున్నారు.
Samayam Telugu flood.


ఏజన్సీలో పోలవరం, వేలేరుపాడు మండలాల పరిధిలో 39 గ్రామాలకు ఐదు రోజులుగా రాకపోకలు నిలిచి పోయాయి. జలదిగ్బంధంలో ఉన్నాయి. కొవ్వూరులో గోష్పాద క్షేత్రాన్ని గోదావరి వరద ముంచెత్తింది.. క్షేత్రంలో రెండు అడుగుల మేరకు వరదనీరు ప్రవహిస్తోంది. పెరవలి మండలంలోని తీపర్రు, కాకరపర్రు, కానూరు, ముక్కామల, మల్లేశ్వరం, ఖండవల్లి.. అలాగే కొవ్వూరు, తాళ్లపూడి, పోలవరం, నిడదవోలు, పెనుగొండ మండలాల్లోను లంకభూములు వరద ముంపులో ఉన్నాయి. లంక గ్రామాలతో పాటూ తీర ప్రాంతంలో ఉన్న గ్రామాలు వరదలో చిక్కుకుపోయాయి.
Read Also:గోదావరి వరదలో ‘పోలవరం’ గ్రామాలు.. ఇళ్ల మీదే బిక్కుబిక్కుమంటూ జనం
గోదావరి వరదతో పోలవరం కాఫర్‌ డ్యాంకు దగ్గరలో ఉన్న పోశమ్మగండి, పూడిపల్లి, దేవీపట్నం, తొయ్యేరు గ్రామాల్లో ఇళ్లు నీటమునిగాయి. శనివారం వచ్చిన వరద చినరమణయ్యపేట, ఎ.వీరవరం, దండంగి, గ్రామాల్లో ఇళ్లు నీట మునిగాయి. కె. వీరవరం, శీతారం, దామనపల్లి మొదలుకుని పెనికలపాడు, మడిపల్లి, అగ్రహారం, గానుగులగొంది, ఏనుగులగూడెం, మంటూరు గ్రామాలను వరద ముంచేసింది. ఇళ్లు మొత్తం నీళ్లలో మునిగిపోయాయి.

ముంపు గ్రామాల్లో ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద బాధితుల కోసం పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రులు తానేటి వనిత, శ్రీరంగనాథరాజు, ఇన్‌చార్జ్‌ మంత్రి సుభాష్‌ చంద్రబోస్‌లు ముంపు ప్రాంతంలో పర్యటిస్తున్నారు. సహాయక చర్యలపై అధికారులతో సమీక్షిస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి ఆదేశాలతో ఉభయ గోదావరి జిల్లాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటూ ముంపు ప్రాంత కుటుంబాలకు అధికారులు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. ఇటు అధికారులు ముంపు ప్రాంతంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, క్లోరిన్‌ మాత్రలతో పాటు అన్ని రకాలైన మందులను సిద్ధం చేశారు.

ఇటు గోదావరి వరద దెబ్బకు తూర్పు జిల్లాలోని 10వేల 354 ఎకరాల్లో వరి చేలు నీట మునిగినట్టు అధికారులు చెబుతున్నారు. గోదావరి వరద పోటెత్తడంతో తూర్పు, మధ్య డెల్టాల పరిధిలోని ప్రధాన డ్రెయిన్ల నుంచి ముంపు నీరు దిగడం లేదు.నదుల నుంచి వస్తున్న నీరు డ్రెయిన్ల ద్వారా పొలాల్లో వస్తోంది. ఈ ప్రభావంతో అమలాపురం, పి.గన్నవరం, ముమ్మిడివరం, రాజోలు, రామచంద్రపురం, కరప, కాకినాడ సబ్‌ డివిజన్ల పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో ముంపు బారిన పడ్డాయి. అలాగే 591 హెక్టార్లలో వరి నారుమళ్లు మునిగిపోయాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.