యాప్నగరం

ఎన్నికలప్పుడు ఒపీనియన్ పోల్స్, ప్రీ-పోల్ నిషేధించాలి.. ఎందుకంటే: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

Jd Lakshminarayana మరోసారి సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఎన్నికల శంఖారావంలో భాగంగా 11వ సంస్కరణపై ట్వీట్ చేశారు. ఒపీనియన్ పోల్స్, ప్రీ పోల్స్ నిషేధించాలంటున్న లక్ష్మీనారాయణ.. ఎందుకో కూడా చెప్పారు. రాజకీయ పార్టీలకు విరాళాలకు 100% పన్ను మినహాయింపులపై కూడా స్పందించారు. నోటాకు సంబంధించి మరో కీలక ప్రతిపాదన కూడా చేశారు. ఇలా సరికొత్తగా సంస్కరణలను తీసుకొస్తున్నారు లక్ష్మీనారాయణ. ఉప ఎన్నికల నిర్వహణపై కూడా కొత్త ప్రతిపాదన తెచ్చారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 29 Nov 2022, 7:57 am

ప్రధానాంశాలు:

  • సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ట్వీట్
  • 11వ సంస్కరణను తెరపైకి తీసుకొచ్చారు
  • ప్రీ, ఒపీనియన్ పోల్స్‌ నిషేధించాలన్నారు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Jd Lakshminarayana
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ (Jd Lakshminarayana) ఎన్నికల సంస్కరణల పేరుతో కొన్ని ప్రతిపాదనల్ని తెరపైకి తెస్తున్నారు. 'ఎన్నికల శంఖారావం' అంటూ ట్విట్టర్ వేదికగా కొన్ని ప్రతిపాదనలు తీసుకొచ్చారు. నిజమైన ప్రజాస్వామ్యానికి ఎన్నికల సంస్కరణలే చాలా ముఖ్యం అంటున్నారు. అందుకే స్వచ్చమైన ఓటు సద్వినియోగం అవ్వడానికి కావలసిన ఎన్నికల సంస్కరణలకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ప్రతిరోజూ ఒక సంస్కరణను సూచిస్తానని.. ప్రజల అభిప్రాయాలను తీసుకుంటాను అన్నారు. ఈ సంస్కరణలను సుప్రీం కోర్టులో పిల్ వేసి అయినా సాధించే ప్రయత్నం చేస్తామన్నారు.
మొదటగా.. ఒక ఎంపీ, ఎమ్మెల్యే కానీ తన పదవీకాలం పూర్తయ్యేలోపు పదవికి రాజీనామా చేస్తే.. ఎన్నికల్లో తదుపరి అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థిని మిగిలిన కాలానికి ప్రజా ప్రతినిధిగా ప్రకటించాలని కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చారు. అలా ఇప్పటి వరకు 11 ప్రతిపాదనల్ని తీసుకొచ్చారు. తాజాగా మీడియా / ఛానెల్‌లు సోషల్ మీడియా ఛానెల్‌లలో ఒపీనియన్ పోల్స్, ప్రీ-పోల్ సర్వేలను ప్రచురించడం, ప్రసారం చేయడం నిషేధించాలి అన్నారు. అవి ఓటరు మనసును ప్రభావితం చేసే అవకాశం ఉందని తన అభిప్రాయాన్ని చెప్పారు.
అంతేకాదు పోటీలో ఉన్న అభ్యర్థుల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే.. వేరే అభ్యర్థులతో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి అన్నారు లక్ష్మీనారాయణ. ఎలక్టోరల్ బాండ్లు , రాజకీయ పార్టీలకు విరాళాలకు 100% పన్ను మినహాయింపులు అసమానతలకు దారితీస్తున్నాయి అన్నారు. బదులుగా ఈ విరాళాలు ఎన్నికల సంస్కరణల అమలు కోసం ఎన్నికల సంఘానికి వెళ్లాలని అభిప్రాయపడ్డారు. వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో తప్ప నమోదైన ఓటర్లందరికీ ఓటింగ్ తప్పనిసరి చేయాలన్నారు.

అలాగే ఆధార్‌కార్డు నమోదు మాదిరిగానే ఓటరు నమోదును నిరంతరంగా నిర్వహించాలని కోరారు. ఎన్నికల్లో గెలుపొందిన వ్యక్తి పోలైన ఓట్లలో కనీసం 50% + 1 ఓట్లు పొందాలని.. అగ్ర అభ్యర్థికి 50% +1 ఓటు రాకపోతే, మొదటి ఇద్దరు అభ్యర్థుల మధ్య ఒక వారం తర్వాత రన్-ఆఫ్ ఎన్నికలు జరగాలని సరికొత్త ప్రతిపాదనను తెచ్చారు. అలాగే ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లో పేర్కొన్న నేరాలకు సంబంధించి కోర్టు ద్వారా క్రిమినల్ అభియోగాలు మోపబడిన వారిని విచారణలో కేసు పరిష్కారమయ్యే వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడాలి అన్నారు. రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం కిందకు తీసుకురావాలని కోరారు. అంతేకాదు ప్రధాని, సీఎంలు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదన్నారు. ఇలా రోజుకో సంస్కరణను ఎన్నికల శంఖారావం పేరుతో ట్వీట్ చేస్తున్నారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.