యాప్నగరం

ప్రణబ్ మరణం దేశానికి తీరని లోటు.. ఏపీ గవర్నర్, సీఎం, ఇతర నేతల దిగ్భ్రాంతి

ప్రణబ్ ముఖర్జీ దివంగతులు కావడంపై ఏపీ గర్నవర్, సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా ఇతర నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Samayam Telugu 31 Aug 2020, 9:33 pm
మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ (84) దివంగతులు కావడంపై యావత్ దేశం శోకసంద్రమైంది. ప్రణబ్ దా కన్నుమూతపై అన్ని వర్గాల వారు దిగ్భ్రాంతి చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Samayam Telugu ప్రణబ్ ముఖర్జీ


ఆ చట్టాల రూపకల్పనలో ముఖ్యుడు
ప్రణబ్ ముఖర్జీ 13వ రాష్ట్రపతిగా దేశానికి గొప్ప సేవలందించారు. 5 దశాబ్దాల పాటు ప్రభుత్వంతో పాటు పార్లమెంటు ద్వారా దేశానికి ఆదర్శప్రాయమైన సేవలందించారు. విదేశీ, రక్షణ, వాణిజ్యం, ఆర్థిక మంత్రిగా వేర్వేరు సమయాల్లో పనిచేసి అరుదైన ఘనతను కలిగి ఉన్నారు. సమాచార హక్కు, ఉపాధి హక్కు, ఆహార భద్రత, యూఐడీఏఐ ఏర్పాటు వంటి ముఖ్యమైన చట్టాల రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. ప్రణబ్ ముఖర్జీ ఒక శక్తివంతమైన వక్త, పండితుడు, మేధావి, అపారమైన రాజకీయ చతురత కలిగిన నాయకుడు.
- బిశ్వ భూషణ్ హరిచందన్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్

దేశానికే తీరని లోటు
ప్రణబ్ ముఖర్జీ మరణం దేశానికి తీరని లోటు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో సంక్షోభాలను పరిణితితో పరిష్కరించిన తీరు ఆదర్శణీయం. రాష్ట్రపతిగా, కేంద్ర మంత్రిగా ప్రణబ్‌ దేశానికి ఎంతో సేవ చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ప్రణబ్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
- వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

గొప్ప రాజనీతిజ్ఞుడు
మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మరణం దేశానికే తీరని లోటు. కాకలు తీరిన రాజనీతిజ్ఞుడిని దేశం కోల్పోయింది. 6 దశాబ్దాల రాజకీయ చరిత్రలో వివాదరహితుడి పేరుపొందారు. ప్రణబ్ ముఖర్జీ నిరాడంబరత, నిబద్ధత, నిజాయితీ అందరికీ మార్గదర్శకం. భారత ఆర్థిక విధానాలు, రక్షణ విధానాల రూపకల్పనలో, దేశీయ, విదేశీ వ్యవహారాల రూపకల్పనలో ప్రణబ్ కృషి గొప్పది.
- చంద్రబాబునాయుడు, ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు

ప్రణబ్ ముఖర్జీ లేని లోటు తీరనిది
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దివంగతులయ్యారనే వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. భారతదేశ రాజకీయాల్లో తనదంటూ సొంత ముద్రను కలిగి ఉన్న ప్రణబ్ ముఖర్జీ మరణం.. దేశానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ప్రణబ్ ముఖర్జీ కుటుంబానికి నా తరఫున జనసేన తరఫున నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
- పవన్ కళ్యాణ్, జనసేన అధ్యక్షుడు

దేశ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు
నాయకుడిగా, ఉపాధ్యాయుడిగా, జర్నలిస్ట్‌గా, రాజనీతిజ్ఞుడు, మంత్రి, రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. రాజకీయాల కంటే ప్రజలే ముందు అని చాటిచెప్పారు. భారతీయుల హృదయాల్లో చెరగని ముద్ర సంపాదించారు. ప్రణబ్ మరణం తీవ్రంగా కలచివేసింది. ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
- నారా లోకేష్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.