యాప్నగరం

బెజవాడ దుర్గమ్మకు పవన్ కళ్యాణ్ సమర్పించిన చీరకు.. ఫుల్ డిమాండ్!

విజయవాడ దుర్గమ్మకు జనసేనాని పవన్ కళ్యాణ్ సమర్పించిన చీరకు ఫుల్ డిమాండ్ ఏర్పడినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ గత నెలలో విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని ‘వారాహి’ వాహనానికి పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి చీర బహుకరించారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 9 Feb 2023, 12:14 am
విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమర్పించిన ‘చీర’కు భారీ క్రేజ్ ఏర్పడినట్లు తెలుస్తోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ గత నెల విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని తన ఎన్నికల వాహనం ‘వారాహి’కి ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కనక దుర్గమ్మ వారికి పవన్ కళ్యాణ్ చీర, సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆ చీరకు నంబర్ కేటాయించిన ఆలయ అధికారులు ఫిబ్రవరి 6వ తేదీన దుర్గమ్మకు అలంకరిస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించి పవన్‌కళ్యాణ్‌కు వారిచ్చిన రశీదు అప్పట్లో వైరల్‌గా మారింది.
Samayam Telugu అమ్మవారికి పవన్ కళ్యాణ్ సమర్పించిన చీర


ఇందులో భాగంగానే ఫిబ్రవరి 6న సోమవారం పవన్‌కళ్యాణ్ సమర్పించిన చీరను అర్చకులు కనకదుర్గమ్మ వారికి బహూకరించారు. అయితే ఇప్పుడు ఆ చీరకు విపరీతమైన క్రేజ్ ఏర్పడినట్లు తెలుస్తోంది. చాలా మంది దుర్గగుడి అధికారులను సంప్రదించి ఆ చీరను తమకు ఇవ్వాలని.. ఎంత డబ్బు అయినా ఇస్తామని చెబుతున్నారట. చాలామంది రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులతో సిఫార్సులు కూడా చేయిస్తున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారం ఆలయ అధికారులకు, కాంట్రాక్టర్‌కు తలనొప్పిగా మారింది.

ఈ నేపథ్యంలోనే చీరల కాంట్రాక్టర్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారట. అమ్మవారికి అలంకరించిన ఆ చీరను మెగా కుటుంబానికే ఇచ్చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గతంలో మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ ఓ చీరను అమ్మవారికి కానుకగా ఇచ్చారు. దాన్ని దక్కించుకోవడానికి పోటీ ఎక్కువగా ఉండటంతో కొద్ది నెలల తర్వాత అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన సురేఖ సోదరుడు, నిర్మాత అల్లు అరవింద్‌కు ఆలయ అధికారులు ఆ చీరను కానుకగా ఇచ్చారు. ఇప్పుడు అదేవిధంగా ఈ చీరను కూడా చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల్లో ఎవరికో ఒకరికి ఇస్తే బాగుంటుందన్న భావనలో కాంట్రాక్టర్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

కాగా, జనవరి 25న కనకదుర్గమ్మను దర్శించుకున్న పవన్ కళ్యాణ్ అమ్మ వారికి 8 వేల రూపాయల విలువైన చీరను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పండితుల నుంచి ఆశీర్వాదాలు తీసుకున్న అనంతరం వారాహి ప్రచార రథానికి ప్రత్యేక పూజలు చేసి విజయవాడ నగర వీధుల్లో ర్యాలీ చేపట్టారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.