యాప్నగరం

హాట్ టాపిక్‌‌గా సంచలన నేత పోస్ట్.. రాజకీయాలకు గుడ్ బై?

ఏపీ రాజకీయాల్లో ఆయన ఓ సంచలనం. టీడీపీలో ఉన్నప్పుడే ప్రతిపక్ష నేతను నడిరోడ్డు మీద హత్తుకున్న ఆయన.. ఎన్నికల తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు ఆయన చేసిన ఓ పోస్టు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

Samayam Telugu 17 Apr 2020, 10:45 am
ఏపీలో రాజకీయాల గురించి తెలిసిన వారికి వల్లభనేని వంశీ పేరు సుపరిచితం. టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన ఈ యువ నేత అనతి కాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. గన్నవరం నియోజవకర్గంలో తిరుగులేని నేతగా ఎదిగారు. కానీ 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన అనూహ్యంగా పార్టీకి షాకిచ్చారు. చంద్రబాబు, లోకేశ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన టీడీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. టీవీ డిబేట్లలో చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు చేసిన ఆరోపణలు, విమర్శలు అప్పట్లో సంచలనం అయ్యాయి. ఆవేశంలో ఆయన వాడకూడని పదాలను సైతం వాడటం టీడీపీ శ్రేణులను ఆశ్చర్యానికి గురి చేసింది.
Samayam Telugu qween


2019 అక్టోబర్‌లో టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి.. సీఎం జగన్‌ను కలిసిన వంశీ వైఎస్సార్సీపీలో మాత్రం చేరలేదు. పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించొద్దనే కారణంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారనే భావన వ్యక్తమైంది. కొంత కాలం తర్వాత వంశీ వ్యవహారం చల్లబడింది. కానీ ఏప్రిల్ 16న ఆయన ఫేస్‌బుక్‌లో చేసిన ఓ పోస్టు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

‘‘పద్నాలుగు సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో నా కష్టసుఖాలలో వెన్నంటి నిలిచిన ప్రతి ఒక్కరికి పేరుపేరున హృదయపూర్వక ధన్యవాదాలు 🙏’’ అని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. సాధారణ పరిస్థితుల్లోనైతే.. ఈ పోస్టుకు పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదేమో. కానీ ఆయన టీడీపీని వీడటం, వైఎస్సార్సీపీలో చేరకపోవడంతో.. ఈ పోస్టుకు ప్రాధాన్యం ఏర్పడింది. ‘రాజకీయ ప్రస్థానం’ అని వంశీ తన పోస్టులో పేర్కొనడంతో.. ఆయన రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నారా? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.

మాములుగానైతే రాజకీయాల్లోకి చేరి 14 ఏళ్లు పూర్తి చేసుకుంటే.. ఇలాంటి పోస్టు చేయాల్సిన అవసరం ఉండదు. కానీ వంశీ ఈ పోస్టు ద్వారా రాజకీయాలకు గుడ్ బై చెబుతున్న సంకేతాలు ఇస్తున్నారనే భావన వ్యక్తం అవుతోంది. ఈ పోస్టు చూసిన కొందరు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ పోస్టు పట్ల స్పందిస్తున్న టీడీపీ అభిమానులు వంశీని విమర్శిస్తుంటే.. వైఎస్సార్సీపీ శ్రేణులు మాత్రం ఆయనకు సపోర్టుగా నిలుస్తున్నాయి. ఇక వంశీ అభిమానులు పార్టీలతో సంబంధం లేకుండా ఆయనకు బాసటగా నిలుస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.