యాప్నగరం

బోటు ప్రమాదం: ఆపరేషన్ రాయల్ వశిష్టకు బ్రేక్.. కారణం అదేనా?

కచ్చులూరు మందం వద్ద మునిగిన బోటును బయటకు తీసేందుకు కాంట్రాక్టు సంస్థ మూడు రోజులుగా ముమ్మర ప్రయత్నాలు చేసింది. అయినా ఫలితం దక్కలేదు. వెలికితీత పనులను నాలుగో రోజు అధికారులు నిలిపివేశారు.

Samayam Telugu 3 Oct 2019, 12:26 pm
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు మందం వద్ద 19 రోజుల క్రితం పర్యాటకులతో వెళ్తున్న రాయల్ వశష్ట పున్నమి బోటు గోదావరిలో ముగినిపోయిన విషయం తెలిసిందే. సుమారు 77 మంది ప్రయాణికులతో వెళ్తున్న బోటు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో స్థానిక మత్స్యకారుల సహకారంతో 26 మంది ప్రయాణికులు ప్రాణాలు దక్కించుకున్నారు. మిగిలిన వారు గల్లంతయ్యారు. సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టి పలువురి మృతదేహాలను గుర్తించారు. ఇంకా 15 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.
Samayam Telugu Vasishtaddddddd


మునిగిన బోటు కిందే మిగిలిన ప్రయాణికుల మృతదేహాలు ఉండొచ్చన్న భావనతో బోటు వెలికితీతకు అధికారులు నిర్ణయించారు. బోట్లు వెలికితీయడంలో అనుభవం ఉన్న కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్స్ సంస్థకు ఆ బాధ్యతలు అప్పగించారు. ఆ సంస్థకి చెందిన నిపుణుడు ధర్మాడి సత్యం బృందం బోటును బయటకు తీసేందుకు మూడు రోజులుగా ముమ్మరంగా ప్రయత్నించింది. తొలిరోజు ఇనుప రోప్‌ను బోటు మునిగిన ప్రాంతంలో వలయాకారంగా వేసి లాగేందుకు యత్నించారు. బరువైన వస్తువు తగలడంతో బోటుగా భావించారు. మరుసటి రోజు లాగుతుండగా రోప్ తెగిపోవడంతో అది బండరాయిగా నిర్ధారణకు వచ్చారు.

Also Read: దసరాకి ట్రైన్ రిజర్వేషన్ దొరకలేదా? అయినా ఏం పర్లేదు!

మూడో రోజు రోప్‌లకు లంగర్లు కట్టి బోటు మునిగిన ప్రాంతంలో జారవిడిచుకుంటూ వచ్చారు. లంగరుకు తగిలితే ఆ తర్వాత రోప్‌ను ఒడ్డున ఉంచిన పొక్లెయిన్‌కు కట్టి లాగే ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. లంగర్ ఖాళీగానే బయటికొచ్చింది. ఇప్పటి వరకూ సంప్రదాయ పద్ధతిలోనే వెలికితీత చర్యలు చేపట్టారు. బోటు వెలికితీసేంత వరకు ప్రయత్నాలు చేస్తామని ధర్మాడి సత్యం బృందం చెబుతోంది.

Read Also: వైఎస్సార్సీపీ బాటలో టీడీపీ.. వర్కౌటవుద్దా?

అయితే మూడో రోజు మధ్యాహ్నం నుంచి గోదావరి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవడం, గోదావరిలో వరద నీటి ఉధృతి పెరగడంతో వెలికితీత పనులను అధికారులు నిలిపివేశారు. వరద ప్రవాహం కారణంగా మరో ప్రమాదం జరగకూడదన్న ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే బోటు మునిగి సుమారు 20 రోజులు అవుతున్నా గల్లంతైన మృతదేహాల ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.