యాప్నగరం

గోదావరిని ముంచెత్తుతున్న వరద.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ.. ఆందోళనలో ఆ ప్రాంత ప్రజలు

భారీ కురుస్తున్న వర్షాల వల్ల గోదావరిలో వరద ముంచెత్తుతోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

Samayam Telugu 15 Aug 2020, 4:18 pm
తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ ఫ్లో 9.84 లక్షల క్యూసెక్కులుగా ఉందని అధికారులు వెల్లడించారు. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Samayam Telugu గోదావరి తీర ప్రాంత ప్రజల ఇబ్బందులు


ఇక వరద ఉద్ధృతికి తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని చాకలిపాలెం వద్ద కాజ్‌వే పూర్తిగా మునిగిపోవడంతో కనకాయలంక, బూరుగులంక, అరికెలవారిపేట, జి.పెదపూడి సహా పలు లంక గ్రామాలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. వైనతేయ నది ఉప్పొంగడంతో మత్స్యకారులు పడవలను ఒడ్డుకు చేరుస్తున్నారు. గోదావరి ఉద్ధృతికి దేవీపట్నం సమీపంలో గండిపోచమ్మ ఆలయంలోకి వరదనీరు చేరింది. రహదారులపై వరద నీరు ప్రవహిస్తుండటంతో దేవీపట్నం మండలంలోని 36 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పడవల్లో ప్రయాణాలు సాగిస్తున్నారు. అలాగే చుట్టూ వరద చేరడంతో తాగేందుకు మంచి నీరు కూడా లేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ముంపు గ్రామాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో తాగునీటి కోసం ముంపు గ్రామాల ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లా పోలవరం వద్ద గోదావరి ఉరకలేస్తోంది. ఎగువున భారీ వర్షాలు కురవడంతో నదిలో వరద ప్రవాహం ఎక్కువైంది. కొత్తూరు కాజ్‌వే వద్ద పది అడుగుల మేర వరదనీరు చేరుకోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

ఇక, ఎగువ నుంచి వస్తున్న గోదావరి వరదను సుమారు 10 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అలాగే తూర్పు డెల్టా కాలువలకు 2,500 క్యూసెక్కులు, మధ్యమ డెల్టాకు మూడు వేల క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 7,250 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇక గోదావరి ఎగువ ప్రాంతంలోని కాలేశ్వరం వద్ద 9.17 మీటర్లు, పేరూరు వద్ద 11.70, దుమ్ముగూడెం వద్ద 12.52, భద్రాచలం వద్ద 45.10 అడుగులు, కూనవరం వద్ద 18.30 మీటర్లు, కుంట వద్ద 12.94 మీటర్లు, కొయిదా వద్ద 23.15 మీటర్లు, పోలవరం వద్ద 12.94 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే హేక్ బ్రిడ్జి వద్ద 16.23 మీటర్లతో గోదావరిలో వరద ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో ఉన్న గోదావరి ఉప నదుల నుంచి నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో గోదావరి నీటి ప్రవాహం మరింతగా పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇక, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు అధికం కావడంతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్దకు వస్తున్న మిగులు జలాలను ఎప్పటికప్పుడు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 11.75 అడుగుల నీటిమట్టం నమోదు కావడంతో ఇరిగేషన్ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.