యాప్నగరం

గ్రామ వాలంటీర్‌పై స్థానికుల దాడి.. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి

లాక్‌డౌన్ సమయంలో ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని చెప్పినందుకు గ్రామ వాలంటీర్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయాడు. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో ఘటన.

Samayam Telugu 29 Apr 2020, 12:01 pm
విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. లాక్‌డౌన్ సమయంలో ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని చెప్పినందుకు గ్రామ వాలంటీర్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయాడు. వారం క్రితం ఘటన జరగ్గా.. ఆలస్యంగా బయటపడింది. స్థానికుల వివరాల మేరకు.. సాలూరు నియోజకవర్గ పరిధిలోని పనుకువలస పంచాయతీ కందిరివలస గ్రామ వాలంటీర్ కోన లక్ష్మణరావు ఈ నెల 18న ఇంటింటి సర్వేతో పాటూ కరోనాపై అవగాహన కల్పించేందుకు వెళ్లాడు. లాక్‌డౌన్ అమల్లో ఉందని.. ఇళ్లలో నుంచి ఎవరూ బయటకు రావొద్దని స్థానికులకు సూచించాడు.
Samayam Telugu vzm


ఈ క్రమంలో స్థానికంగా ఉండే గాదిపల్లి చిన్నారావు రోడ్డుపై కనిపించడంతో.. బయట తిరగొద్దు ఇంట్లోకి వెళ్లాలని వాలంటీర్ లక్ష్మణరావు చెప్పాడు. దీంతో రెచ్చిపోయిన చిన్నారావు వాలంటీర్‌తో వాగ్వాదానికి దిగాడు.. తర్వాత ఆ గొడవ సద్దుమణిగింది. ఈ గొడవను మనసులో పెట్టుకున్న చిన్నారావు తన సోదరుడు, తండ్రితో కలిసి ఈ నెల 20న లక్ష్మణరావుపై దాడికి దిగారు. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడగా.. సాలూరులోని ఆస్పత్రికి తరలించారు.

వాలంటీర్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. తర్వాత లక్ష్మణరావు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో అతడ్ని విశాఖ జీజీహెచ్‌కు తరలించగా.. అక్కడ చికిత్సపొందుతూ అతడు మంగళవారం రాత్రి చనిపోయాడు. దీంతో ఈ ఘటన బయటపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.