యాప్నగరం

ఏపీలో మరో 3 రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు తీవ్ర హెచ్చరికలు

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది.

Samayam Telugu 19 Aug 2020, 6:45 pm
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో బుధ, గురువారాల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. గోదావరికి వరద ఉద్ధృతి తీవ్రంగా ఉండటంతో జిల్లా అధికారులను విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంత, లంక గ్రామల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కన్నబాబు సూచించారు. తీరం వెంబడి గంటకు 40 కి.మీ నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు.
Samayam Telugu వర్షం


3 రోజుల వాతావరణ వివరాలు..
ఆగస్టు 19వ తేదీ: విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఉభయ గోదావరి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది.

ఆగస్టు 20వ తేదీ: ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది.

ఆగస్టు 21వ తేదీ: తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో మిగిలిన చోట్ల చెదురుమదురుగా తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. ఈ మేరకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు ప్రకటన విడుదల చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.