యాప్నగరం

ఏపీ సీఎం స్పెషల్ చీఫ్ సెక్రటరీపై హైకోర్టు ఆగ్రహం.. నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేస్తామని వార్నింగ్

Poonam Malakondaiah పై ఏపీ హైకోర్టు సీరియస్ అయ్యింది. ఓ ఉద్యోగి జీతం చెల్లింపుల విషయంలో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరగ్గా.. కోర్టుకు పూనం మాలకొండయ్య హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏకంగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసేందుకు ధర్మాసనం సిద్ధమైంది. కానీ లాయర్ వచ్చే విచారణకు హాజరవుతారని చెప్పడంతో కోర్టు శాంతించింది. తాము చెప్పినా లెక్కలేదా.. ఉద్యోగికి జీతం ఎందుకు చెల్లించలేదని అధికారుల్ని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 25 Mar 2023, 6:41 am
(Ap High Court) ఏపీ హైకోర్టు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో విచారణకు హాజరు కాకపోవడంపై సీరియస్ అయ్యింది. 2018లో విజయవాడ దంత వైద్య కళాశాలలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నసుజాత.. హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. తనకు జీతం చెల్లించాలని క్లియర్‌గా హైకోర్టు ఆదేశాలున్నప్పటికీ.. అధికారులు తనకు కొన్నేళ్లుగా జీతం చెల్లించడం లేదన్నారు.
Samayam Telugu AP High Court Poonam Malakondaiah


ఈ పిటిషన్‌పై ఈ ఏడాది ఫిబ్రవరి 24న ధర్మాసనం విచారణ చేపట్టింది. అప్పటి వైద్య విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యతో పాటూ అప్పటి వైద్య విద్య డైరెక్టర్‌ బాబ్జీ.. అలాగే ప్రభుత్వ దంత వైద్య కళాశాల అప్పటి ప్రిన్సిపల్‌ మురళీమోహన్‌లు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. హైకోర్టులో శుక్రవారం జరిగిన విచారణకు మురళీమోహన్‌ మాత్రమే హాజరుకాగా.. మిగిలిన వాళ్లు హాజరుకాలేదు. దీంతో ధర్మాసనం సీరియస్‌గా స్పందించింది.

కోర్టు పిటిషనర్‌కు జీతం చెల్లించాలని ఆదేశాలిచ్చినా పట్టించుకోరా అంటూ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. జీతం చెల్లించాలని పదే, పదే యాచించాలా.. కోర్టు ఉత్తర్వులంటే అంత నిర్లక్ష్యమా అంటూ ఘాటుగా స్పందించింది. 2018 నుంచి జీతం ఇవ్వకుండానే పిటిషనర్‌తో పని చేయించుకుంటున్నారని అని ప్రశ్నించింది. అవసరమైతే జీతాలు చెల్లించని.. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి, అకౌంటెంట్‌ జనరల్‌‌ను కూడా కోర్టుకు పిలిపిస్తామంది ధర్మాసనం

ఒకవేళ న్యాయస్థానానికి రాలేనప్పుడు సకాలంలో అనుమతి పిటిషన్‌ దాఖలు చేయాలని సీనియర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌కు తెలీదా అంటూ ప్రశ్నించింది ధర్మాసనం. రాజ్యాంగబద్ధ కోర్టు కంటే వారిద్దరు ఎక్కువ అని భావిస్తున్నారా అంటూ సీరియస్‌గా స్పందించింది. పూనం మాలకొండయ్య అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో విచారణకు రాలేకపోయారని ప్రభుత్వం తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వొద్దని కోరారు.

పూనం మాలకొండయ్య తదుపరి విచారణకు హాజరవుతారని లాయర్ అన్నారు. అలాగే బాబ్జీ పదవీ విరమణ చేశారని.. ఆయన ప్రస్తుతం ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీగా వ్యవహరిస్తున్నారని కోర్టుకు చెప్పారు. ఆయనకు హైకోర్టు జారీ చేసిన నోటీసే అందలేదని.. ఆయన కూడా తదుపరి విచారణకు హాజరవుతారన్నారు. దీంతో హైకోర్టు ధర్మాసనం ఈనెల 31కి విచారణను వాయిదా వేసింది. పూనం మాలకొండయ్యతో పాటూ బాబ్జీ, మురళీమోహన్‌లు కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. సీనియర్ ఐఏఎస్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. వచ్చే విచారణకు కచ్చితంగా హాజరుకావాలని పూనం మాలకొండయ్యను కోర్టు ఆదేశించింది.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.