యాప్నగరం

రాజమండ్రిలో భారీ వర్షం.. మహానాడు సభలో తడిసి ముద్దయిన టీడీపీ కార్యకర్తలు

రాజమండ్రిలో పెద్ద ఎత్తున వర్షం కురిసింది. కడియం మండలంలో టీడీపీ మహానాడు వేదిక వద్ద కూడా భారీ వర్షం కురవడంతో పార్టీ కార్యకర్తలు తడిసిముద్దయ్యారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 28 May 2023, 7:27 pm
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో కడియం మండలం వేమగిరిలో తెలుగు దేశం పార్టీ మహానాడు సభా ప్రాంగణం వద్ద వర్షం బీభత్సానికి కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెద్ద ఎత్తున వర్షం కురుస్తున్నా.. మహానాడు కార్యక్రమాన్ని కొనసాగించారు. దీంతో టీడీపీ కార్యకర్తలు వర్షంలో తడుస్తూనే తమ నాయకుల ప్రసంగాలు విన్నారు.
Samayam Telugu వర్షంలో తడుస్తున్న టీడీపీ కార్యకర్తలు


ఈ క్రమంలోనే భారీ వర్షం, ఈదురు గాలుల వల్ల భారీ కటౌట్లు కూలిపోయాయి. దీంతో మహానాడు సభా ప్రాంగణం సమీపంలో పెను ప్రమాదం తప్పింది. భారీ ఈదురు గాలులకు నేతల కటౌట్‌ ఒక్కసారిగా వీఐపీ టెంట్‌పై పడటంతో నేలకొరిగింది.

అప్పటి వరకు అదే టెంట్‌లో తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కళా వెంకట్రావు, అశోక్‌ గజపతిరాజు, ఎమ్మెల్యే బాలవీరాంజనేయులు, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఇతర ముఖ్య నేతలు ఉన్నారు. వీరందరూ బయటికి వచ్చిన కొద్దిసేపటికే భారీ గాలుల ధాటికి ఎన్టీఆర్‌ కటౌట్‌ పడిపోయి వీఐపీ టెంట్‌ నేలకొరిగింది.

అయితే, వర్షంలోనూ పార్టీ నేతలు తమ ప్రసంగాలు కొనసాగించారు. తడవకుండా కార్యకర్తలు తలపై కుర్చీలు అడ్డుపెట్టుకొని సభను వీక్షించారు. వర్షం కారణంగా సభా ప్రాంగణం, మైదానంలో ఉన్న ఎల్‌ఈడీలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలను ముందస్తు జాగ్రత్తగా సిబ్బంది తరలించారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రాజమహేంద్రవరం నుంచి సభా ప్రాంగణానికి వస్తున్న సమయంలో వర్షం కురవడంతో ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. కొంత ఆలస్యంగా సభా వేదిక వద్దకు ఆయన చేరుకున్నారు. వేమగిరి కూడలి వద్ద టీడీపీ కార్యకర్తలు, అభిమానుల కోలాహలం నెలకొంది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వేలాది సంఖ్యలో కార్యకర్తలు బహిరంగ సభకు తరలివచ్చారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.