యాప్నగరం

మాటిస్తున్నా.. వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తే: పవన్ కళ్యాణ్ కీలక హామీ

జనసేన అధికారంలోకి వస్తే ఐటీ రంగాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తానని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ మేరకు ఐటీ రంగ నిపుణులతో ఆదివారం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 14 Aug 2022, 10:18 pm
జనసేన అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమను తీసుకొస్తామని ఆ పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్ చెప్పారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ ఐటీ విభాగం రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్ మాట్లాడుతూ.. అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామంటే రాష్ట్రానికి ఆర్థిక పరిపుష్టి ఎలా సాధ్యమవుతుందని సూటిగా ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు అమలు ప్రజలకు మేలు చేసేలా ఉండాలే గాని, బలహీనపరిచేలా ఉండకూడదన్నారు.
Samayam Telugu సమావేశంలో మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్


ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగిన తర్వాత హైదరాబాద్‌, బెంగళూరు నగరాల్లో మాత్రమే ఐటీ అభివృద్ధి జరిగిందని పవన్ కళ్యాణ్ అన్నారు. రాయలసీమ ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడి యువత బెంగళూరుకు వెళ్లిపోతున్నామని.. ఇక్కడ ఐటీ రంగాన్ని ఎందుకు అభివృద్ధి చేయరని అడిగారని గుర్తు చేశారు. ఈరోజు మాట ఇస్తున్నా.. వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తే, మిగతా రాష్ట్రాల్లో కంటే ఎక్కువ స్థాయిలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఐటీ పాలసీ అంటే ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ప్రలోభ పెట్టడం కాదన్నారు.

దావోస్‌ పర్యటనకు వెళ్లి ఫొటోలు దిగి వచ్చినంత మాత్రాన రాష్ట్రానికి పెట్టుబడులు రావని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారరు. ‘‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జనసేన తరఫున ఛాలెంజ్‌ చేస్తున్నా... జగన్‌ సీఎం అయిన తర్వాత రాష్ట్రానికి ఎంత పెట్టుబడులు వచ్చాయి? ఎంత మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు?’’ అని పవన్ నిలదీశారు.

ఏవో అద్భుతాలు జరుగుతాయని తాను పార్టీ పెట్టలేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. కోట్లాది మందికి నిర్దేశం చేయాలంటే రాజకీయంగా నలగాలని.. అనుభవం లేకుండా వస్తే వైసీపీ ప్రభుత్వం మాదిరి ఉంటుందని వ్యాఖ్యానించారు. పదవి వెతుక్కుంటూ రావాలి గానీ.. పదవి వెంట పడకూడదనేది తన సిద్ధాంతమని పవన్ తెలిపారు. పదవి అనేది మన ప్రయాణంలో భాగంగా కావాలన్నారు. స్థాయి, స్థోమత ఉంటే ఏదో ఒక రోజు ప్రజలు మనకు ఆ అవకాశం ఇస్తారని పవన్‌ కళ్యాణ్‌ చెప్పారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.