యాప్నగరం

ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక.. మరో మూడ్రోజులు వర్షాలు, తుఫాన్ ముప్పు పొంచి ఉందా?

Andhra Pradesh Rains మరో మూడు రోజులు వానలు తప్పవంటోన్న వాతావరణశాఖ. ఆవర్తనంతో పాటూ ద్రోణి ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు. అంతేకాదు తుఫాన్ ముప్పు కూడా పొంచి ఉందని.. కాకపోతే బెంగాల్ వైపు వెళ్లొచ్చని చెబుతున్నారు. ఇప్పటకే రాష్ట్రవ్యాప్తంగా జోరుగా కురుస్తున్న వర్షాలు. రైతులు కూడా పంట నష్టంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు. సీఎం జగన్‌ కూడా సమీక్ష నిర్వహించారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 3 May 2023, 1:12 pm

ప్రధానాంశాలు:

  • ఏపీకి మరోసారి వర్ష సూచన
  • మరో మూడు రోజులు వానలు
  • తుఫాన్ ముప్పు కూడా ఉందా
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Andhra Pradesh News
AP Weather Today: ఆంధ్రప్రదేశ్‌లో జోరు వానలు కురుస్తున్నాయి. పశ్చిమ విదర్భ నుంచి కర్ణాటక వరకు ద్రోణి ప్రభావం కొనసాగుతోందని వాతావరణశాఖ తెలిపింది. అంతేకాదు దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ పరిసరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో మూడు రోజుల పాటూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు.. అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఈదురు గాలులు వీస్తాయని.. అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉందంటున్నారు.
AP Raina Alert: నేడు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి, అల్లూరిసీతారామరాజు, ఏలూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగుల కూడి మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల సంస్థ అప్రమత్తం చేసింది.. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెల 4న అనకాపల్లి, అల్లూరి, మన్యం, కాకినాడ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అనంతపురం జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. అలాగే 5న అనకాపల్లి, అల్లూరి, మన్యం, కాకినాడ, ఏలూరు, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో వానలు పడతాయంటున్నారు.
అంతేకాదు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 6న ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది అంటోంది వాతావరణశాఖ. ఈ నెల 8 నాటికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది.. 9 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్‌ సముద్రంలో ప్రవేశించి వాయుగుండంగా మారనుందని భావిస్తున్నారు. ఈ నెల 10 నాటికి తుఫాన్‌గా మారనుంది. ఇది బంగ్లాదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ వైపు పయనిస్తుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.
నాలుగైదు రోజులుగా జోరున వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, గుంటూరుతో పాటూ మిగిలిన జిల్లాల్లో భారీగా వర్షపాతం నమోదైంది. మరో మూడు రోజులు వర్ష సూచనతో పాటూ తుఫాన్ హెచ్చరికలు ఉండటంతో అందరిలో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అకాల వర్షాలతో పంట నష్టం జరిగిందని.. మళ్లీ వర్ష సూచనతో ఆందోళనలో ఉన్నారు.

మరోవైపు ఈ భారీ వర్షాలు, పంట నష్టంపై అధికారులతో సీఎం సమీక్ష చేశారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని.. అందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాల వల్ల రైతుల వద్ద తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు.

వర్షాలతో దెబ్బ తిన్న పంటల ఎన్యుమరేషన్ త్వరగా పూర్తి చేయాలని.. వెంటనే నివేదికను ఇవ్వాలని కోరారు. ఈ నెలలో వైఎస్సార్‌ రైతు భరోసాతో పాటు.. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేలా ఇన్‌పుట్‌ సబ్సిడీ జారీకి సిద్ధమవ్వాలన్నారు. అంతేకాదు నష్టపోయిన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించి సామాజిక తనిఖీ పూర్తి చేయాలన్నారు ముఖ్యమంత్రి.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.