యాప్నగరం

ఏపీకి మోచా తుఫాన్ ముప్పు లేనట్లే .. ఈ నెల 10 నుంచి అసలు సినిమా, ముందుంది ముసళ్ల పండగ

Ap Mocha Cyclone Rains సోమవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. మంగళవారానికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ నెల 10కి తుఫాన్‌గా మారే అవకాశం. ఈ నెల 14న బంగ్లాదేశ్, మయన్మార్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఏపీపై ప్రభావం ఉండదంటున్న వాతావరణశాఖ. వచ్చే రెండు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తర్ వర్షాలు పడతాయంటున్నారు. అయితే ఈ నెల 10 తర్వాత ఎండలు మండిపోతాయంటున్నారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 9 May 2023, 12:42 pm

ప్రధానాంశాలు:

  • ఏపీకి మోచా తుఫాన్ ముప్పు లేనట్లే
  • రెండు రోజుల పాటూ వర్షాలు మాత్రమే
  • ఈ నెల 10 తర్వాత మళ్లీ ఎండల తీవ్రత
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Andhra Mocha Rains
Andhra Pradesh Rains: ఆగ్నేయ బంగాళాఖాతం, పక్కనే ఉన్న దక్షిణ అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఇవాళ అది వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత ఉత్తర వాయవ్యంగా పయనించి తూర్పు మధ్య బంగాళాఖాతంలో ప్రవేశిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ నెల పదికి తుఫాన్‌గా మారనుంది.. అనంతరం మరింత బలపడి తీవ్ర తుఫాన్‌గా మారి ఈనెల 11న ముందు ఉత్తర వాయవ్యంగా.. ఆ తర్వాత దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్యంగా పయనిస్తుందని చెబుతున్నారు.
ఈశాన్యంగా పయనించే క్రమంలో అతి తీవ్ర తుఫాన్‌గా బలపడుతుంది అంటున్నారు. ఈనెల 14న దక్షిణ బంగ్లాదేశ్‌, మయన్మార్‌ మధ్య తీరం దాటనుందని అంచనా వేస్తున్నారు. ఈ తుఫాన్ ప్రభావం ఒడిశా, పశ్చిమబెంగాల్‌ తీరాలపైనా ఉంటుందంటున్నారు. ఏపీతో పాటూ తెలంగాణకు ఎలాంటి ముప్పు లేదంటున్నారు. అయితే ఈ ప్రభావంతో మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే బంగాళాఖాతంలో తుఫాన్ కాబట్టి మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని వాతవరణశాఖ హెచ్చరించింది.

మరోవైపు మోచా తుఫాన్‌పై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా అలర్ట్ చేసింది. 'ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. రేపు అదే ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఎల్లుండి తూర్పుమధ్య బంగాళాఖాతం మరియు అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాలపై తుఫానుగా మారే అవకాశం ఉంది. ఇది గురువారం వరకు ఉత్తర వాయువ్య దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వైపు కదులుతుంది. ఆ తర్వాత, ఇది క్రమంగా ఉత్తర-ఈశాన్య దిశగా బంగ్లాదేశ్-మయన్మార్ తీరాల వైపు వెళ్లే అవకాశం ఉంది' ఉందని అంచనా వేస్తున్నారు.
అలాగే నైరుతి బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం అల్పపీడనంతో అనుసంధానమై ఉంది. ఈ మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంటోంది ఐఎండీ. తుఫాన్ ప్రభావం ఏపీపై ఉండకపోవడంతో వానలు తగ్గుముఖం పట్టి ఎండలు విజృంభిస్తాయని అంచనా వేస్తున్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 2–4 డిగ్రీలు అధికంగా నమోదవుతాయి అంటున్నారు. మళ్లీ సెగలు ఖాయం అని భావిస్తున్నారు.
గత రెండు వారాలుగా వర్షాలతో వాతావరణం చల్లబండి. సోమవారం నుంచి మాత్రం మళ్లీ ఎండలు మొదలయ్యాయి. కర్నూలులో 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఈనెల 12 తర్వాత మళ్లీ ఎండలు, వేడి గాలులు తప్పవంటున్నారు. ఈనెల 14 తర్వాత తీవ్ర వడగాడ్పులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. రెండు వారాల పాటూ చల్లటి వాతావరణాన్ని ఎంజాయ్ చేసిన జనాలకు.. మళ్లీ సూర్యుడి భగభగలు తప్పేలా లేవు.


రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.