యాప్నగరం

Dowleswaram Barrage మరింత భయపెడుతోన్న గోదావరి.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ

గోదావరి నది మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఇప్పటికే ఓసారి గోదావరికి వరదలు రాగా.. ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలతో నదిలోకి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

Samayam Telugu 9 Sep 2019, 9:35 am
మరోసారి గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం మళ్లీ వరద గుప్పిట్లో చిక్కుకుంది. నాలుగు రోజులుగా 36 గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఆదివారం సాయంత్రానికి దేవీపట్నం, తొయ్యేరు, పూడిపల్లి, పోచమ్మగండి వద్ద ఇళ్లను వరద చుట్టిముట్టడంతో బాధితులంతా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. గండిపోచమ్మ అమ్మవారి ఆలయంలోకి వరదనీరు భారీగా చేరడంతో ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. వరద పెరగడంతో గోదావరి తీర మాలైన కచ్‌లూరు నుంచి కొండమొదలు వరకు ఉన్న 14 గ్రామాల ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు.
Samayam Telugu dhava


భద్రాచలం వద్ద గోదావరి అంతకంతకూ పెరుగుతోంది ఆదివారం సాయంత్రానికి 49.8 అడుగులుగా ఉన్న నీటి మట్టం రాత్రి 8 గంటలకు 50.8 అడుగులకు చేరింది. సోమవారం ఉదయానికి ఇది 51.2 అడుగులకు చేరడంతో రెండో నెంబరు ప్రమాదహెచ్చరిక కొనసాగుతోంది. కుంట వద్ద శబరి నది కూడా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఎగువ నుంచి భారీ ఎత్తున వరద వచ్చి చేరుతుండటంతో.. కూనవరం, పోలవరం ప్రాంతాల్లో గోదావరి నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. పోలవరం కాఫర్ డ్యాం వద్ద నీటి మట్టం మరో రెండు మీటర్ల పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ముంపు గ్రామాల ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు.

మరోవైపు, దవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద 13.9 అడుగుల నీటిమట్టం నమోదైంది. దీంతో అధికారులు రెండో నెంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరి ఎగువ, దిగువ ప్రాంతాల్లో అధికారులను మరింత అప్రమత్తం చేస్తున్నట్లు వరద నియంత్రణ అధికారి ఆర్‌. మోహన్‌రావు తెలిపారు. డెల్టా కాల్వకు 8,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా.. సముద్రంలోకి 13.19 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు.

నాలుగు రోజులుగా వరదలో ఉన్నా తమను పట్టించుకున్నవారు లేరని బాధితులు వాపోతున్నారు. అధికారులు భోజనాలు ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల్లో గోదావరికి రెండుసార్లు వరదలు రావడంతో కట్టుబట్టలతో ఇళ్లను వదిలి రావాల్సి వచ్చిందని, ఉపాధిని కోల్పోయామని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం 25 కిలోల బియ్యం, కేజీ పప్పు, ప్యాకెట్ నూనె మాత్రమే ఇస్తే నెల రోజులు ఎలా సరిపోతాయని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, సోమవారం నుంచి వరద ముప్పు గ్రామాల్లో 2500 కుటుంబాలకు ఉదయం అల్పాహారంతో పాటు రెండు పూటలా భోజనాలు అందిస్తామని అధికారులు పేర్కొన్నారు. వరద ముంపు గ్రామాల్లో తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.