యాప్నగరం

YS Jaganతో ముకేశ్ అంబానీ భేటీ.. అసలు కారణం ఇదేనట.. వైసీపీ వర్గాల్లో టెన్షన్!

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ శనివారం ఏపీ సీఎం జగన్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. జగన్ సీఎం అయ్యాక అంబానీని కలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ముకేశ్ అంబానీకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో సత్సంబంధాలు ఉన్నాయని చెబుతారు. కానీ మారిన పరిణామాల నేపథ్యంలో సీఎం హోదాలో ఉన్న జగన్‌ను అంబానీ కలిశారు. ఈ భేటీలో పెట్టుబడులకు సంబంధించి చర్చలు జరిపారని చెబుతున్నప్పటికీ.. అసలు కారణం మాత్రం వేరే ఉందట.

Samayam Telugu 1 Mar 2020, 9:09 am
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ శనివారం ఏపీ సీఎం జగన్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. జగన్ సీఎం అయ్యాక అంబానీని కలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ముకేశ్ అంబానీకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో సత్సంబంధాలు ఉన్నాయని చెబుతారు. కానీ మారిన పరిణామాల నేపథ్యంలో సీఎం హోదాలో ఉన్న జగన్‌ను అంబానీ కలిశారు. ఈ భేటీలో పెట్టుబడులకు సంబంధించి చర్చలు జరిపారని చెబుతున్నప్పటికీ.. అసలు కారణం మాత్రం వేరే ఉందట.
Samayam Telugu is this the reason behind mukesh ambani meeting with cm ys jagan
YS Jaganతో ముకేశ్ అంబానీ భేటీ.. అసలు కారణం ఇదేనట.. వైసీపీ వర్గాల్లో టెన్షన్!


రాజ్యసభ సీటు కోసం?

ముకేశ్ అంబానీకి వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విమానాశ్రయంలో స్వాగతం పలికారు. అంబానీ వెంట ఆయన తనయుడు అనంత్‌తోపాటు రాజ్యసభ సభ్యుడు, పారిశ్రామిక వేత్త పరిమల్‌ నత్వానీ కూడా ఉన్నారు. నత్వానీ 2008 నుంచి రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. మరోసారి ఆయన్ను పెద్దల సభకు పంపడం కోసం అంబానీ జగన్‌‌‌ను కలిశారట. వైఎస్సార్సీపీ తరఫున నలుగురు రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉన్న తరుణంలో నత్వానీకి అవకాశం ఇవ్వాలని అంబానీ కోరారని ప్రచారం జరుగుతోంది.

అమిత్ షా కోరారని ప్రచారం..

వైఎస్సార్సీపీ నుంచి ఒక రాజ్యసభ సీటును బీజేపీ కోరిందనే వార్తలు ఇటీవల వెలువడిన సంగతి తెలిసిందే. ఆ సీటును నత్వానీకి ఇవ్వాలని బీజేపీ కోరుతోందట. ఇటీవల జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడు అమిత్ షా ఈ విషయాన్ని వెల్లడించారని టాక్. దీనికి వైఎస్సార్సీపీ అధినేత కూడా సుముఖంగా ఉన్నారని.. అందుకే నత్వానీ, అంబానీ వచ్చి జగన్‌ను కలిశారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంతకూ నత్వానీకి రాజ్యసభ సీటు కోసం అంబానీ ఎందుకు లాబీయింగ్ చేయిస్తున్నారనే దానికి కూడా కారణాలు చెబుతున్నారు.

అంబానీకి దగ్గరి మనిషి

పరిమళ్ ధీరజ్‌లాల్ నత్వానీ 1990ల్లో పారిశ్రామికవేత్తగా ఉన్నారు. 1997లో ఆయన రిలయన్స్ గ్రూప్‌లో చేరారు. 2016 నాటికి ఆయన రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ అఫైర్స్‌ గ్రూప్ ప్రెసిడెంట‌్‌గా ఎదిగారు. ముకేశ్‌తోనే కాదు ఆయన తండ్రి ధీరూభాయి అంబానీతోనూ నత్వానీ కలిసి పని చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కోర్ లీడర్‌షిప్‌లో ఆయన కీలక సభ్యుడు. జామ్‌నగర్ రిఫైరీ కోసం పది వేల ఎకరాల భూమిని సేకరించడంలో ముఖ్యపాత్ర పోషించారు. రిలయన్స్ 4జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటులోనూ నత్వానీ కీలక భూమిక పోషించారు. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గానూ ఆయన బాధ్యతలు వహిస్తున్నారు. ఆయనకు బీజేపీతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. కమలనాథులకు, ముకేశ్‌కు మధ్య సంధానకర్త నత్వానీ అని కూడా అంటుంటారు. 2008లో తొలిసారి జార్ఖండ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నత్వానీ.. 2014లో తిరిగి ఎన్నికయ్యారు.

Image Courtesy: parimalnathwani.com

జగన్‌తో అంబానీ గంటన్నరకుపైగా భేటీ

వైఎస్ జగన్, అంబానీ భేటీ రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే.. వైఎస్ మరణం వెనుక రిలయన్స్ అధినేత హస్తం ఉందని ఓ రష్యన్ వెబ్‌సైట్‌ కథనాన్ని వెలువర్చింది. దీన్ని మీడియా హైలెట్ చేయడంతో.. వైఎస్ అభిమానులు రిలయన్స్ ఆస్తులపై దాడులు చేశారు. ఇప్పటికీ కొందరు వైఎస్ అభిమానులు మహానేత మరణం ఓ కుట్రగా అనుమానిస్తుంటారు. అలాంటిది వైఎస్ తనయుడు అంబానీతో గంటర్నరకు పైగా సమావేశం కావడం వైసీపీ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.

ఆశావహుల్లో టెన్షన్

నత్వానీకి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని బీజేపీ, అంబానీ జగన్‌ను అడిగి ఉంటే.. అందుకు ఆయన కూడా సుముఖంగా ఉంటే.. వైఎస్సార్సీపీ ఆశావహుల్లో ఒకరికి నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైతే వైవీ సుబ్బారెడ్డి, రాంకీ అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, బీద మస్తాన్ రావుల పేర్లు రాజ్యసభ కోసం బలంగా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో జగన్‌తో అంబానీ భేటీని టీడీపీ శ్రేణులు ట్రోల్ చేస్తున్నాయి. ‘గతంలో వైఎస్ మరణానికి కుట్ర పన్నారని ఆరోపణలు చేశారు.. ఇప్పుడు ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. అంటే గతంలో చేసిన ఆరోపణలు తప్పని ఒప్పుకుంటున్నట్టేనా?’ అని ప్రశ్నిస్తున్నారు.

Image Courtesy: parimalnathwani.com

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.