యాప్నగరం

కల్కి భగవాన్ ఆశ్రమాలపై ఐటీ దాడులు.. భారీ అవినీతి ఆరోపణలు!

కల్కి భగవాన్ ఆశ్రమాల్లో ఐటీ అధికారుల సోదాలు. బినామీల పేరుతో భారీగా భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు. కల్కి భగవాన్ కుమారుడు, కోడలిని ప్రశ్నిస్తున్న ఐటీ అధికారులు!

Samayam Telugu 16 Oct 2019, 4:59 pm
కల్కి భగవాన్ ఆశ్రమాలపై ఐటీ దాడులు కలకలంరేపాయి. బుధవారం ఉదయం నుంచి ఏపీ, తమిళనాడులో ఏకకాలంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. చిత్తూరు జిల్లా వరదయ్య పాళ్యంలో నడుస్తున్న కల్కి ఆశ్రమంలో నాలుగు ఐటీ టీమ్‌లు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అలాగే తమిళనాడు నేమం కల్కి ఆశ్రమానికి ఐటీ అధికారులు వెళ్లారు. ఉదయం నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి.. ఐటీ అధికారులు లోపలికి ఎవర్నీ అనుమతించడం లేదని తెలుస్తోంది. కల్కి ఆశ్రమాలతో పాటూ అనుబంధ సంస్థలున్న మరో ముప్పై చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
Samayam Telugu kalki


కల్కి ఆశ్రమ నిర్వాహకులు ఆధ్యాత్మిక సేవలకు భక్తుల నుంచి సేకరిస్తున్న విరాళాలను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయట. ఈ సొమ్మును భూముల కొనుగోలు, డిపాజిట్ల వంటివాటిలో దుర్వినియోగం చే్తున్నట్లు తమిళనాడు ఐటీ అధికారులకు ఫిర్యాదు అందినట్టు తెలుస్తోంది. దీంతో తమిళనాడు ఐటీ అధికారుల టీమ్‌లు కల్కి భగవాన్ ఆశ్రమాల్లో సోదాలు చేస్తున్నట్లు సమాచారం.

వరదయ్య పాళ్యం కల్కి ఆశ్రమంపై నాలుగు ఐటీ అధికారుల టీమ్‌లు తనిఖీలకు రావడంతో నిర్వాహకులు షాక్ తిన్నారు. బుచ్చినాయుడు కండ్రిగ, వరదయ్య పాళ్యం.. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట, తడ మండలాల్లో కల్కి భూ వ్యవహారానికి సంబంధించిన బినామీ వ్యవహారం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయట. ఈ తనిఖీల్లో ఐటీ అధికారులు పలు కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. బినామీల పేరుతో వేల ఎకరాల భూముల క్రయ విక్రయాలు జరిపినట్లు ఆరోపణలు వస్తున్నాయట.

ఇదిలా ఉంటే దాడులు సమయంలో కల్కి భగవాన్‌, ఆయన సతీమణి పద్మావతి అందుబాటులో లేరట. చెన్నై నుంగంబాకం ప్రధాన కార్యాలయంలో కల్కి భగవాన్‌ కుమారుడు కృష్ణ, కోడలు ప్రీతిని ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆశ్రమాల ట్రస్ట్‌ నిర్వహాకుడు లోకేష్‌ దాసాజీతో పాటు మరికొంతమంది సిబ్బందిని రహస్యంగా విచారిస్తున్నారట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.