యాప్నగరం

వారిని ఆదుకోండి.. జగన్ సర్కారుకు పవన్‌ కళ్యాణ్ కీలక డిమాండ్లు

YS Jagan Mohan Reddy: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

Samayam Telugu 26 Apr 2020, 2:57 pm
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెట్టుబడి రాయితీ అందించాలని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల వల్ల వరి, మొక్కజొన్న, ఉద్యాన పంటలు ధ్వంసం అయ్యాయని, రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కోతకు వచ్చిన, కల్లాల్లో ఉన్న పంట నీట మునిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Samayam Telugu పవన్ కళ్యాణ్, సీఎం జగన్


దెబ్బతిన్న వరి రైతులకు ప్రభుత్వం ఉపశమన పథకాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ కోరారు. రంగు మారిన ధాన్యానికి ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇతర ప్రాంతాల నుంచి ధాన్యం రావడంతో స్థానిక రైతులకు మద్దతు ధర రావడం లేదని తెలిపారు. అలా ధాన్యం రాకుండా కట్టడి చేయాలని సూచించారు.

అలాగే కరోనాతో పాటు అకాల వర్షాలు రైతులను తీవ్రంగా దెబ్బతీశాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. 2019- 20 ఆర్థిక సంవత్సరంలోనే ధరల స్థిరీకరణ నిధికి రూ.3 వేల కోట్లు కేటాయించారని.. ఆ మొత్తం నుంచి నిధులు కేటాయించి రైతులను ఆదుకోవాలని కోరారు. అలాగే రైతుల నుంచి వసూలు చేసే నీటి తీరువా పన్ను రెట్టింపు చేయాలనే ఆలోచన సరికాదన్నారు. గిట్టుబాటు ధరలు, మార్కెట్‌ సదుపాయం లేక ఇబ్బందుల్లో ఉన్న రైతుల పొలాలకు నీటి తీరువాను పెంచాలనుకోవడం తగదని.. పెంపు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని పవన్‌కల్యాణ్‌ డిమాండ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.