యాప్నగరం

నేడు బీజేపీ నేతలతో పవన్‌ కీలక భేటీ.. పొత్తు దిశగా అడుగులు

Janasena Party| కమలంతో ప్రయాణం దిశగా జనసేన అడుగులు. విజయవాడలో బీజేపీతో నేతలతో పవన్ కళ్యాణ్ కీలక భేటీ.. కీలక అంశాలపై చర్చించనున్న నేతలు.. మధ్యాహ్నం ఉమ్మడి మీడియా సమావేశం.

Samayam Telugu 16 Jan 2020, 3:02 pm
ఏపీలో మరోసారి పొత్తుల రాజకీయం తెరపైకి వచ్చింది. జనసేన బీజేపీతో కలిసి నడిచే దిశగా అడుగులు వేస్తోంది. ఇవాళ విజయవాడలో జనసేన, బీజేపీ నేతల సమావేశం దీనికి వేదిక కానుంది. ఓ ప్రైవేట్ హోటల్‌లో ఉదయం 11 గంటలకు ఇరు పార్టీల నేతలు సమావేశంకానున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఉమ్మడిగా ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. ఈ భేటీకి జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్.. బీజేపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్, సునీల్ దేవధర్‌లు హాజరవుతున్నారు.
Samayam Telugu pawan.


బీజేపీ, జనసేనలు ప్రజా సమస్యలపై పోరాడేందుకు ఒక అవగాహనకు రానున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కలిసి పనిచేయాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అమరావతి విషయంలోనూ రెండు పార్టీలు కలిసి ఉద్యమం చేయాలని భావిస్తున్నాయట. ఒక్కమాటలో చెప్పాలంటే ఇరు పార్టీలు మిత్రపక్షాలుగా కొనసాగే ఆలోచనలో ఉన్నాయనుకోవచ్చు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా గత వారమే ఢిల్లీలో బీజేపీ పెద్దల్ని కలిశారు. ఇవే అంశాలపై వారితో చర్చించారు.. అక్కడే గ్రీన్ సిగ్నల్ రాగా.. ఇప్పుడు రాష్ట్ర నేతలతో విజయవాడలో భేటీ అవుతున్నారు. ఈ సమావేశంలోనే అన్ని అంశాలపై చర్చించి.. ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఉమ్మడి మీడియా సమావేశంలోనే తమ విధి విధానాలను ప్రకటిస్తారనే చర్చ నడుస్తోంది.

జనసేన పార్టీ బీజేపీతో కలిసి నడవడం కొత్తేమీ కాదు. 2014లో బీజేపీ, టీడీపీలతో కలిసి పనిచేసింది.. ఆ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా.. అభ్యర్థుల తరపున పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేశారు. 2019 ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పోటీ చేయగా.. కేవలం ఒక్క సీటుకే పరిమితం అయ్యారు. మళ్లీ ఇప్పుడు బీజేపీతో పొత్తు దిశగా అడుగులు వేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.