యాప్నగరం

మోదీకి అభినందనలు, కేంద్రం సాహసోపేత నిర్ణయం తీసుకుంది: పవన్ కళ్యాణ్

Article 370 Scrapped | కేంద్రం నిర్ణయాన్ని పవన్, చంద్రబాబు సమర్థించారు. జనసేనాని ఓ అడుగు ముందుకేసి కేంద్ర నిర్ణయాన్ని సాహసోపేతమైనదిగా అభివర్ణించారు.

Samayam Telugu 5 Aug 2019, 7:27 pm
ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని జనసేన నేత పవన్ కళ్యాణ్ స్వాగతించారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దుచేయడం సాహసోపేతమైన నిర్ణయంగా ఆయన అభివర్ణించారు. ‘‘ఈ నిర్ణయంతో సుందర కశ్మీర్‌లో శాంతి నెలకొంటుందని నమ్ముతున్నాను. అఖండ భారతదేశం నుంచి పాకిస్థాన్ విడిపోయినప్పుడు జరిగిన హింసలో రెండు ప్రాంతాల నుంచి లక్షలాది మంది చనిపోయారని చదివినప్పుడు హృదయం వేదనకు గురయ్యింది.
Samayam Telugu pawan modi


ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేయడం కొన్ని ప్రాంతాల వారికి ఇబ్బంది కలిగించినప్పటికీ శాశ్వతంగా శాంతి నెలకొంటుందని విశ్వసిస్తున్నాను. ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఒక భారతీయుడిగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ నిర్ణయంతో రెండు దేశాల మధ్య శాంతి నెలకొంటుందని ఆశిస్తున్నాను. దేశ సమగ్రత ముఖ్యం" అని పవన్ కళ్యాణ్ తెలిపారు. సోమవారం భీమవరంలోని జనసేన కార్యకర్తలు, నాయకుల సమావేశంలో పవన్ కళ్యాణ్ ఈ ప్రకటన చేశారు.
జమ్మూ కశ్మీర్ పునర్విభజన విషయమై టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ఆర్టికల్ 370ని రద్దు చేసే విషయంలో తెలుగు దేశం పార్టీ కేంద్రానికి మద్దతు తెలుపుతుందని బాబు తెలిపారు. జమ్మూ కశ్మీర్లో శాంతిసుస్థిరతలు వర్థిల్లాలని ఆయన ఆకాంక్షించారు.

ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లుకు వైఎస్ఆర్సీపీ కూడా మద్దతు తెలిపింది. ప్రధాని మోదీ, అమిత్ షాలపై ఎంపీ విజయసాయి రెడ్డి పొగడ్తల వర్షం కురిపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.