యాప్నగరం

నాగబాబు వ్యాఖ్యలతో జనసేనకు సంబంధం లేదు.. పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన

నాయకుల వ్యక్తిగత అభిప్రాయాలతో జనసేన పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. నాగబాబు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమేనని వ్యాఖ్యానించారు.

Samayam Telugu 23 May 2020, 4:54 pm
జనసేన పార్టీలో లక్షలాదిగా ఉన్న నాయకులు, జనసైనికులు, అభిమానులు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తం చేసేవి వారి వ్యక్తిగత అభిప్రాయాలే గానీ.. పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. ఈ మధ్యకాలంలో కొన్ని సున్నితమైన అంశాలపై పార్టీకి చెందిన వారు వ్యక్తం చేస్తున్న భావాలను పార్టీ అభిప్రాయాలుగా ప్రత్యర్థులు వక్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమని.. ఆయన అభిప్రాయాలతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు.
Samayam Telugu పవన్ కళ్యాణ్‌తో నాగబాబు


వివిధ అంశాలపై పార్టీ అభిప్రాయాలు, నిర్ణయాలను పార్టీ అధికారికంగా ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేస్తూనే ఉందని పవన్ కళ్యాణ్ వివరించారు. వివిధ అంశాలపై జనసేన అధికారికంగా చేసిన ప్రకటనలు మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.

ప్రస్తుతం కరోనా మహమ్మారితో పోరాడుతూ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని.. ఇలాంటి తరుణంలో ప్రజాసేవ తప్ప మరే ఇతర అంశాల జోలికి వెళ్లకుండా క్రమశిక్షణతో ముందుకు సాగాలని పవన్‌ కల్యాణ్‌ పార్టీ శ్రేణులకు సూచించారు. కాగా, పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు గత కొంత కాలంగా గాడ్సే దేశభక్తుడని, కరెన్సీ నోట్లపై గాంధీయే కాక, ఇతరుల బొమ్మలు కూడా ముద్రించాలని వివాదాస్పద ట్వీట్లు చేస్తున్న విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.