యాప్నగరం

YSRCP ఫ్యాక్షన్ రాజకీయాలు, ఇంకోసారి మా వాళ్లపై దాడి చేస్తే.. జగన్‌కు పవన్ వార్నింగ్

Kakinada ఎమ్మెల్యే తనను బూతులు తిట్టడం పట్ల పవన్ కళ్యాణ్ మండి పడ్డారు. మదమెక్కితేనే ఇలాంటి మాటలు వస్తాయన్న పవన్.. తమ వాళ్లపై దాడి చేయడం సరికాదన్నారు.

Samayam Telugu 14 Jan 2020, 5:55 pm
కాకినాడ: వైఎస్సార్సీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన జనసైనికులను పరామర్శించిన పవన్ కళ్యాణ్.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చేసిన తనపై వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి.. ఉపయోగించకూడని భాష ఉపయోగించారన్న జనసేనాని.. మా ఆడపడుచుల మీద, జనసైనికుల మీద దాడి చేయడం క్షమార్హం కాదన్నారు. మీరు తిట్టి.. మా వాళ్ల మీద కేసులు పెడతారా? అని పవన్ ప్రశ్నించారు. తమ వాళ్లను బూతులు తిడుతూ, దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూసినట్టు చూడటం బాధాకరమన్న పవన్.. సహనం చేతగాని తనం కాదన్నారు.
Samayam Telugu pk11.


వైసీపీ పాలన వస్తే.. పాలెగాళ్ల రాజ్యం, ఫ్యాక్షన్ రాజకీయాలు వస్తాయని 2014 ఎన్నికల ముందు నుంచి హెచ్చరిస్తున్నానని పవన్ తెలిపారు. ఇలాంటి భాషను, ప్రజాప్రతినిధులను తూర్పు గోదావరి జిల్లాలో ఎప్పుడూ చూడలేదన్నారు. తుని సంఘటన జరిగినప్పుడు పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించారన్న జనసేనాని.. సుమోటోగా తీసుకొని ఎమ్మెల్యేపై కేసు పెట్టాల్సిందన్నారు. కానీ మా వాళ్లు నిరసన చేపట్టడానికి హక్కులు లేవన్నారని పవన్ ఆరోపించారు.

‘‘151 మంది ఎమ్మెల్యేలు ఉంటే మీరేమైనా దిగొచ్చారని అనుకుంటున్నారా? సంస్కారం ఉంది కాబట్టే ఇంకా నియంత్రణలో ఉన్నాం. పోలీసు శాఖకు, ఉన్నతాధికారులకు, రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తులకు కాకినాడ నుంచి చెబుతున్నాం.. ఇంకొకసారి మా వాళ్ల మీద దాడి చేస్తే మేం చేతులు కట్టుకొని కూర్చోం. మంత్రులకు, ప్రజాప్రతినిధులకు బాధ్యత ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎలాంటి భాష వాడుతున్నారో తెలుసు. స్థాయి దాటేసి మాట్లాడుతున్నార’’ని జనసేనాని వ్యాఖ్యానించారు.

ఈ సంఘటనకు కారణమైన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేయాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపై ఉందన్న పవన్.. దాడికి సంబంధించిన వీడియోలు తమ వద్ద ఉన్నాయన్నారు. వీటన్నింటితో రిపోర్ట్ తయారు చేసి గవర్నర్‌ను కలుస్తామన్నారు. ‘‘వైసీపీ సుస్థిరతతో కూడిన పాలన అందించాలి. కానీ శాంతియుతంగా ఉండే గోదావరి జిల్లాల్లో ఫ్యాక్షన్ సంస్కృతిని తీసుకొస్తామంటే సహించం. దాడులు చేసిన వారిపై పోలీసులు కేసులు పెట్టాల’’ని పవన్ డిమాండ్ చేశారు.

‘‘అరికాలు నుంచి తల వరకు మదమెక్కితేనే ఇలాంటి మాటలు నోట్లో నుంచి వస్తాయి. ఈ మదాన్ని అణచుకోండి లేదంటే ప్రజలే మీ మదాన్ని అణచివేస్తార’’ని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. పాలన ఒక చోటే ఉండి, అభివృద్ధి అన్ని చోట్లా ఉండాలన్న జనసేనాని.. ఇదే విషయాన్ని జాతీయ స్థాయి నేతలతో చర్చించానన్నారు. జనవరి 16న విజయవాడలో కీలకమైన మీటింగ్ జరగబోతుందన్న పవన్.. తర్వాత వివరాలను తెలియజేస్తామన్నారు.

అంబేద్కర్ వికేంద్రీకరణ గురించి ఉన్నంతగా ఆలోచించారన్న పవన్.. అంబేద్కర్ మీద గౌరవం ఉంటే.. 2014లోనే ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలోనే జగన్ ఎందుకు మూడు రాజధానుల ప్రతిపాదన చేయలేదని జనసేనాని ప్రశ్నించారు. అధికారం అనేది శివుడు మెడలో పాము లాంటిదన్న పవన్.. అధికారం నుంచి దిగిపోయాక మీ పరిస్థితేంటో గుర్తుంచుకోండన్నారు. జనసైనికులపై పడిన దెబ్బ తనకు బలంగా గుర్తుండిపోతుందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.